Kalvakuntla Kavita: సంక్షేమం పక్కనపెట్టి ఫుట్బాల్పై రూ.10 కోట్లు ఖర్చు.. సీఎం రేవంత్పై కవిత విమర్శలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 02:29 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19: ఆదివాసులు, గిరిజనులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి సీతక్క (Minister Seethakka) శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో ఆదివాసులు, గిరిజనులకు ఏం చేశారో వెల్లడించాలన్నారు. సింగరేణి పుట్టినిల్లు ఇల్లందులో కొత్త బొగ్గు బావులు మొదలు పెట్టాలని అన్నారు. సింగరేణి కార్మికులు సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కొత్తగూడెంకు ప్రాధాన్యం లేదని విమర్శించారు. ఒక మంత్రి కొత్తగూడెంను దత్తత తీసుకోవాలని.. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలన్నారు.
మణుగూరు ఓసీ 2 ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి జిల్లాలో పొలాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో విలీనమైన ఎటపాక పురుషోత్తమ పట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం గ్రామాలను భద్రాచలంలో కలపాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామాలను భద్రాచలంలో కలపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత విజ్ఞప్తి చేశారు. అలాగే అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి చేశారు. ప్రసాద్ స్కీంలో భద్రాచలం రామాలయానికి రెండు వందల కోట్లు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. కొత్తగూడెం బైపాస్ రోడ్డు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆదివాసులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఉన్నాయని వారిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సింగరేణి నిర్వాసిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు.. సుప్రీం ఆదేశం
ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి సరఫరా.. చెక్ పెట్టిన పోలీసులు
Read Latest Telangana News And Telugu News