Yakatpura Incident: మ్యాన్ హోల్లో పడిపోయిన ఐదేళ్ల బాలిక.. స్పందించిన చార్మినార్ జోనల్ కమిషనర్
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:06 PM
హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు.
హైదరాబాద్: యాకత్ పురాలో చోటు చేసుకున్న ఓ ప్రమాదకర సంఘటనపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు. మౌలాకా చిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఓపెన్గా ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటన స్థానికులను, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే, అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారిని బయటకు తీశారు. ఈ ఘటనలో బాలికకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే లోకల్ డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం చిన్నారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, నిన్న హైడ్రా సిబ్బంది మ్యాన్ హోల్ను శుభ్రం చేసిన తర్వాత, తిరిగి మూయకుండా అక్కడి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చార్మినార్ జోనల్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
Also Read:
రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందా.. సీబీఐసీ ఛైర్మన్ క్లారిటీ
For More Latest News