Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ.. భారీగా పోలీసుల మోహరింపు
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:44 AM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో వెయ్యి మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అసంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో వివిధ అంశాలపై ఆందోళనకారులు ముట్టడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈరోజు మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ సర్పంచ్లను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్లు చేస్తున్నారు.
కాగా.. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. శాసనసభ టేబుల్పై మొత్తం 11 కీలక పత్రాలను ప్రభుత్వం ఉంచనుంది. జీఎస్టీ సవరణ ఆర్డినెన్స్ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ సవరణ ఆర్డినెన్స్లు ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. తెలంగాణ మున్సిపాలిటీస్ రెండో సవరణ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టనున్నారు.
సమగ్ర శిక్ష (TSSS) 2023-24 ఆడిట్ నివేదిక, పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలల ఆడిట్ నివేదికను సర్కార్ సభలో పెట్టనుంది. ప్రభుత్వ నియామకాల చట్ట సవరణ ఆర్డినెన్స్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. సిబ్బంది నిర్మాణం, జీతాలపై రెండో సవరణ ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ మూడో సవరణ ఆర్డినెన్స్ సభ ముందుకు రానున్నాయి. పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను సమర్పించనున్నారు. తెలంగాణ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇవి కూడా చదవండి...
పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..
Read Latest Telangana News And Telugu News