Share News

Komaram Bheem Death Anniversary: కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసమే: మంత్రి సీతక్క

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:37 PM

గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆదివాసి గిరిజనులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారన్నారు.

Komaram Bheem Death Anniversary: కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసమే: మంత్రి సీతక్క
Komaram Bheem Death Anniversary

హైదరాబాద్, అక్టోబర్ 7: ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఆ మహానీయుడు విగ్రహానికి మంత్రి సీతక్క (Minister Seethakka) పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దానికి అనుగుణంగా ప్రత్యేక జీవో ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహానాయకుడి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటమని చెప్పుకొచ్చారు. ‘మా గుడాల్లో మా రాజ్యం కావాలని మా అడవుల మీద మాకు హక్కు ఉండాలని పోరాటం చేశారు’ అని గుర్తు చేశారు.


వారి పోరాటాల ఫలితంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తొలి ప్రధాని నెహ్రూ ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారని తెలిపారు. కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయ్యిందని వెల్లడించారు. రాజ్యాంగంలో ఈశాన్య రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారన్నారు. మైదాన ప్రాంత రాష్ట్రాల్లోని ఆదివాసీల పరిరక్షణ కోసం షెడ్యూల్ 5ను రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. ఐటీడీఏ ఏర్పాటులోనూ కొమరం భీం స్ఫూర్తి ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధితోనే కొమరం భీం ఆశయాలు నెరవేరుతాయని చెప్పుకొచ్చారు.


గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆదివాసి గిరిజనులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో ఆదివాసి గిరిజనులకు పోడు హక్కులు కల్పించారని తెలిపారు. ఉద్యోగాల భర్తీలోనూ ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించామని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఆదివాసి గిరిజనులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందరికీ భూములు, ఇండ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే కొమరం భీం ఆశయాలను సాధించిన వాళ్లమవుతామని సీతక్క అన్నారు.


తెలంగాణ ఉద్యమ నినాదం కూడా నీళ్లు నిధులు నియామకాలన్నారు. అంతకుముందే జల్ జంగల్ జమీన్ పోరాటాలు చేశారని.. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. కొమరం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ట్రైబల్ శాఖ మంత్రి లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సమాజం కోసం పాటుపడిన వారి త్యాగాలను కొనియాడాలన్నారు. కేవలం సంబరాలు చేసుకుంటే సరిపోదని.. వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారి స్ఫూర్తిని ముందుతరాలకు అందజేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే

కాంగ్రెస్ ధోకా కార్డుపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 12:38 PM