Hyderabad Crime: బైక్పై వెంబడించి... కత్తులు, రివాల్వర్తో అతి కిరాతకంగా..
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:11 AM
హైదరాబాద్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వెంబడించి మరీ కత్తులు, తుపాకులతో కాల్చి చంపేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 8: నగరంలో ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాచకొండ కమిషనరేట్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైంది రియల్టర్ వ్యాపారి వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే వ్యాపారిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకట రత్నం బైక్పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని మరో బైక్పై వెంబడించారు. అదును చూసి అతడిపై కిరాతకంగా దాడి చేశారు. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో నడిరోడ్డుపైనే వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం వెంకటరత్నాన్ని బైక్పై వెంబడించిన సదరు వ్యక్తులు వేట కత్తితో దాడి చేశారు. అంతటితో ఆగకుండా రివాల్వర్తో షూట్ చేసి నడిరోడ్డుపై దారుణానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా తుపాకుల శబ్ధం వినిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంకటరత్నాన్ని హతమార్చిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రియల్టర్ వ్యాపారి స్పాట్లోనే మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాపారి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఘటనాస్థలిలో ఒక బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరత్నాన్ని ఎవరు హత్య చేశారు?... హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం.. రైతుల గగ్గోలు
Read Latest Telangana News And Telugu News