Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:43 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 09: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించి.. ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌పై నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో.. ఈ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది.

ఇక ఈ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్‌మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనలను వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్, పాస్ వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురి కీలక నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం ఆరోపించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది.


ఫోన్ ట్యాపింగ్ అంశంపై వాస్తవాలు వెలికి తీయాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమని సిట్ అధికారుల ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.


అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. అమెరికాలో ఉన్నారు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు.. సిట్ అధికారులు అరెస్ట్ చేయకుండా ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభాకర్ రావును ముందస్తు అరెస్ట్ చేయవద్దంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


అనంతరం ఈ కేసు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు.. సిట్ అధికారులు సంధించిన పలు ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. మరోవైపు ప్రభాకర్ రావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును రేవంత్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ కేసును బుధవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రభాకర్ రావు బెయిల్‌ను రద్దు చేస్తుందా? లేదా? అంటూ ఒక చర్చ తెలంగాణలో వాడి వేడిగా నడుస్తోంది.

ఇవి కూడా చదవండి...

పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక

ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగే.. ఫేజ్‌ వైజ్ కాదు..

Read Latest TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 05:59 PM