Komaram Bheem Tragedy: కొమురం భీం జిల్లాలో విషాదం.. నీటిగుంతలో పడి నలుగురు మృతి
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:29 PM
మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో నీటి కోసం ముగ్గురు పిల్లలు కుంటలోకి దిగారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులు నీటిలోనే మునిగిపోయారు.
కొమురం భీం: వాంకిడి మండలం డాబా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని నీటిగుంతలో పడి ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన వారిని మోర్లే బుజ్జి బాయి (35), మోర్లే గన్ను(12), వాడే మహేశ్వరి(9), అదే శశికళ(9)గా గుర్తించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో ఆమె కుమారుడు గన్నుతోపాటు మహేశ్వరి, శశికళ అనే మరో ఇద్దరు బాలికలు నీటి కోసం ఓ కుంట వద్దకు వెళ్లారు. అనంతరం వారంతా మంచినీళ్ల కోసం కుంటలోకి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. అది గమనించిన సదరు మహిళ.. చిన్నారులను రక్షించేందుకు నీటిగుంతలోకి దిగింది. గుంతలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో ఆమెతో సహా పిల్లలంతా ఇరుక్కుపోయారు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మణిపూర్ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని