Jubilee Hills Bypoll: హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ వేయనున్న సునీత
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:59 AM
ఈనెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేసింది. మరోవైపు ఎల్లుండి నుంచి ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం ఉధృతం చేయనుంది.
హైదరాబాద్, అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు (Jubilee Hills Bypoll) నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఇక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) రేపు (బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య నామినేషన్ వేస్తారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం నలుగురితో కలిసి నామినేషన్ వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈనెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేసింది. మరోవైపు ఎల్లుండి నుంచి ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం ఉధృతం చేయనుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవలానే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ లోనే మకాం వేయనున్నారు.
కాగా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే టికెట్టు ఇచ్చిన బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సునీత గెలవడమే గోపీనాథ్కు ఇచ్చే ఘన నివాళి అని మాజీ మంత్రులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది బీఆర్ఎస్. సమీక్షలు, ర్యాలీలతో ప్రచారంలో దూకుడు పెంచింది గులాబీ పార్టీ. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జూబ్లీహిల్స్ నియోజవర్గంలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.
మరోవైపు నిన్నటి (సోమవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలి రోజు 10 మంది నామినేషన్ వేశారు. ఈనెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న ఎన్నిక జరుగనుండగా.. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి..
లోడు ఎంతయినా తట్టుకునేలా.. 1000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు
జూబ్లీహిల్స్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాం..
Read Latest Telangana News And Telugu News