Hyderabad Wedding Gunshots: తుపాకీ కాల్పుల వీడియో వైరల్.. కేసులో పురోగతి సాధించిన పోలీసులు
ABN , Publish Date - Dec 17 , 2025 | 08:53 PM
మెహదీపట్నం లంగర్ హౌస్లో ఇటీవల ఒక ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్, డిసెంబర్ 17: మెహదీపట్నం లంగర్ హౌస్లోని ఒక వివాహం సమయంలో తుపాకీతో కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో లంగర్ హౌస్ పోలీసులు సోమవారం పురోగతి సాధించారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన తుపాకీ బొమ్మదని పోలీసులు తేల్చారు. డిసెంబర్ 12వ తేదీన స్థానిక సుగ్నా గార్డెన్ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహంలో బారాత్ సమయంలో తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుడు మొహమ్మద్ ఫసీయుద్దీన్తోపాటు అతని స్నేహితుడు షేక్ అల్తాఫ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వీడియోపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో వీడియో చూపించిన తుపాకీ నిజమైనది కాదని.. బొమ్మ తుపాకీ అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రజల్లో భయాందోళన కలిగించేందుకు వరుడితోపాటు అతడి స్నేహితుడిపై చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వివాహ వేడుకల కార్యక్రమాల్లో ఆయుధాలు, లాఠీలు, బొమ్మ తుపాకీలు వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని ప్రజలకు ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాక్ ఇచ్చిన రైల్వే శాఖ.. జనరల్ బోగీ ప్రయాణికులను వదల్లా..
కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..
For More AP News And Telugu News