CM Revanth Reddy: ఆలయాల అభివృద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:19 PM
గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సోమవారం నాడు హైదరాబాద్లో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లను సీఎంకు ఉన్నతాధికారులు వివరించారు.
అలాగే మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను సైతం సీఎం రేవంత్ పరిశీలించారు. ఆ తర్వాత ఆదేశాలు జారీ చేశారు. అలాగే పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్తోపాటు పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వారంలో మేడారానికి వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.
అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని వారికి సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు సోమవారం.. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను సీఎం ప్రారంభించారు. అలాగే నియో పోలిస్ వాటర్.. సప్లై & సేవరేజ్ ప్రాజెక్ట్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితను అభినందించిన సీఎం రేవంత్
ఐఏఎస్లు బదిలీ.. టీటీడీ ఈఓగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్
For More TG News And Telugu News