CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్స్ భాగస్వాములు కావాలి.. సీఎం కీలక సూచనలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:12 PM
మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ ఆర్థికాభివృద్ధి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్: తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లందరికీ రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన (సోమవారం)సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ ఆర్థికాభివృద్ధి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేకతను చాటారన్నారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం చెప్పారు.
మూసీ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టటంలో ప్రత్యేక చొరవ చూపించారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిలో ఇంజనీర్స్ తమ వంతు పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్లో గేమ్ ఛేంజర్ ప్లాన్..