BRS Kadhana Bheri: బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:58 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీ కథన భేరి పేరిట నిర్వహించ తలపెట్టిన భారీ సభను మరోసారి వాయిదా వేసింది.
హైదరాబాద్, ఆగస్ట్ 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీ కథన భేరి పేరిట నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో కరీంనగర్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత గంగుల కమలాకర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ ప్రకటన చేశారు. భారీ వర్ష సూచన కారణంగానే ఈ సభను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. అందులో భాగంగా ఆగస్ట్ 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిందని వివరించారు. ఈ క్రమంలో ఈ కథన భేరి సభను వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే వాతావరణం అనుకూలించిన తర్వాత ఈ సభను నిర్వహించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కథనభేరి సభను మళ్లీ ఎప్పుడు నిర్వహించనున్నది మరికొద్ది రోజుల్లో నిర్ణయించి.. ప్రకటిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు గమనించాలని సూచించారు.
అసలు అయితే ఆగస్ట్ 8వ తేదీన కరీంనగర్ వేదికగా ఈ కథన భేరీ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తొలుత నిర్ణయించింది. కానీ ఎందుకో.. ఈ సభను ఆగస్ట్ 14వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించింది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఈ సభను మరోసారి వాయిదా వేశారు. ఈ సభ ఏర్పాటుపై వాయిదాల పర్వం కొనసాగడానికి వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది.
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News