Medha High School In Bowenpally: మేధా హైస్కూల్పై విద్యాశాఖ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:23 PM
విద్యార్థుల తరగతి గదుల పక్కనే గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా స్కూల్పై విద్యా శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ హైస్కూల్ను సీజ్ చేశారు.
మేడ్చల్, సెప్టెంబర్ 14: సికింద్రాబాద్ పరిధి బోయినపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న మేధా హైస్కూల్పై విద్యాశాఖ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. మేధా హైస్కూల్ను విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. బాలానగర్ మండల విద్యాశాఖ అధికారి హరీశ్ చంద్ర ఆదేశాలతో.. ఈ హైస్కూల్ను సీజ్ చేశారు. అంతేకాకుండా స్కూల్కు సంబంధించిన అన్ని అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది.
ఈ మేధా హైస్కూల్ను సోమవారం నాడు విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ హైస్కూల్ను శాశ్వతంగా మూసి వేయనున్నారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని ఇతర స్కూళ్లలో జాయిన్ చేసేందుకు విద్యా శాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సికింద్రాబాద్ పరిధి ఓల్డ్ బోయినపల్లిలోని మేధా హైస్కూల్పై రెండ్రోజుల క్రితం ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్బంగా స్కూల్ వేదికగా భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకు సంబంధించి హైస్కూల్ ప్రిన్సిపల్తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల తరగతి గదుల పక్కనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. అందుకు సంబంధించి లక్షలాది రూపాయిల విలువైన డ్రగ్స్ను ఈ సందర్భంగా ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మేధా హైస్కూల్కి గతంలో జారీ చేసిన అన్ని అనుమతులు రద్దు చేయడంతోపాటు శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్తోపాటు పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా దారులను అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నలుగురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా వరంగల్ రైల్వేస్టేషన్లో ఆగిన కొణార్క్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీని విలువ రూ.8లక్షల వరకూ ఉంటుందని స్పష్టం చేశారు.
ములుగు జిల్లా వాజేడు పరిధిలో ఇద్దరిన్ని అరెస్టు చేసి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వరంగల్ జిల్లా ఐనవోలు పరిధిలో ఒక పెడ్లర్ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.53.5లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఇక సంగారెడ్డిలో అల్ప్రాజోలం తయారీ యూనిట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ క్రమంలో 270 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 7.89కేజీల నోర్డయాజిపామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో రూ.16.31లక్షల విలువైన డ్రగ్స్తోపాటు వీటి తయారీకి సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
తాత వరల్డ్ లీడర్.. మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్..
For More TG News And Telugu news