Harish Rao: 21వేల కోట్ల రుణాలిచ్చినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా!
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:53 AM
రాష్ట్రంలోని మహిళలకు రూ.21 వేల కోట్ల మేర వడ్డీలేని రుణాలిచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు.
బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటాం
బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోదు
ఈరోజు ఎన్నికలొచ్చినా ఒంటరిగానే
100 సీట్లతో అధికారంలోకి వస్తాం
మా కార్యకర్తలను వేధిస్తే రెడ్బుక్లో రాస్తాం: హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలకు రూ.21 వేల కోట్ల మేర వడ్డీలేని రుణాలిచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. పదేపదే అబద్ధాలు చెబుతూ.. మహిళలను మోసగిచడం తగదని హితవు పలికారు. రూ.21 వేల కోట్ల రుణాలిచ్చినట్లు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెప్పేవన్నీ అబద్ధాలని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, చేపట్టిన పరీక్షలకు సంబంధించినవే తప్ప.. కాంగ్రెస్ హయాంలో పదివేలు కూడా దాటలేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా రేవంత్ నిజాలు మాట్లడటం లేదని ఎద్దేవా చేశారు. ‘‘ఏడాది పాలనలో రేవంత్ చేసిందేముంది? ఢిల్లీకి కప్పం కట్టడం తప్ప. ఒక్క ఎకరాకు నీళ్లిచ్చావా? ఏదైనా ప్రాజెక్టు కట్టావా? కనీసం చెక్ డ్యాం నిర్మించావా? ఒక చెరువైనా తవ్వినట్లుంటే చెప్పాలి’’ అని నిలదీశారు.
పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడమేకాకుండా.. తెలంగాణకు శాపంగా మారనున్న గోదావరి బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై కిషన్రెడ్డి, బండిసంజయ్, ఈటల రాజేందర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణాలో మనవాటా వాడుకునే తెలివిలేదని, తెలంగాణపై ప్రేమ ఉంటే బనకచర్ల ప్రాజెక్టు ఆపాలని డిమాండ్ చేశారు. బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టినందుకే.. సమీక్షలను పోలీస్ కమాండ్ కంట్రోల్లో చేస్తున్నావా? అని రేవంత్ను ప్రశ్నించారు. ప్రపచం సుందరి పోటీలు చేపట్టి తెలంగాణకు చెడ్డపేరు తెచ్చారని హరీశ్ విమర్శించారు. ‘‘మిల్లీమ్యాగితో నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ అసభ్యకరంగా ప్రవర్తించారని వస్తున్న వార్తలపై సమాధానం చెప్పాలి.
అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని వెంటనే బహిర్గతం చేయాలి. అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎంను డిమాండ్ చేశారు. పథకాలకు పైసలు లేవంటూ.. ప్రపంచ సుందరి పోటీలకు రూ.200 కోట్లను ఎక్కడి నుంచి తెచ్చి, ఖర్చుచేశారని నిలదీశారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్ల బిల్లులను ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్కు లేదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించకపోతే.. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల భట్టి విక్రమార్కకు ప్రేమలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉంటుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రజలు స్పష్టతతో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. 100 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్బుక్లో వివరాలు నోట్ చేసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News