Rohit Sharma: డైట్లో ఉన్నా.. మళ్లీ లావైపోతా!: రోహిత్ శర్మ
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:31 PM
సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టు హోటల్లో విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. కాగా వన్డేల్లో తొలి శతకం నమోదు చేసిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను కేక్ కట్ చేయమని కోహ్లీ సూచించాడు. కేక్ కట్ చేసిన యశస్వి సహచరులకు అందించాడు. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విరాట్ కోహ్లీ కేక్ తినగా.. రోహిత్ శర్మ(Rohit Sharma) మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యశస్వి జైస్వాల్.. రోహిత్ శర్మకు కేక్ తినిపించడానికి దగ్గరికి వెళ్లాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘మళ్లీ లావైపోతాను. స్ట్రిక్ట్ డైట్. నాకొద్దు..’ అంటూ ముందుకు సాగాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభిషేక్ నాయర్ నేతృత్వంలో ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి సన్నగా మారాడు.
వైజాగ్లో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116*) శతకం బాదగా.. రోహిత్ శర్మ(75), విరాట్ కోహ్లీ (65*) అర్ధ శతకాలు సాధించారు. మళ్లీ రోహిత్, కోహ్లీలను జనవరిలో మైదానంలో చూస్తాం. జనవరి 11 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్లో రో-కో ఆడతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!