Share News

Yogi Adityanath: అయోధ్య తర్వాత టార్గెట్‌పై యోగి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 08:16 PM

అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాను రుణపడి ఉంటానని, ఈ రోజు (డిసెంబర్ 6) చాలా కీలకమైన రోజని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) తొలగించామని, తద్వారా దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మార్గం సుగమమైందని చెప్పారు.

Yogi Adityanath: అయోధ్య తర్వాత టార్గెట్‌పై యోగి ఆసక్తికర వ్యాఖ్యలు
Yogi Adityanath

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అయోధ్య తర్వాత తమ టార్గెట్‌, ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను వెల్లడించారు. అయోధ్య నిర్మాణం తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. శనివారంనాడిక్కడ జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా తన హయాలో జరిగిన రామమందిర శంకుస్థాపన, నిర్మాణంతో పాటు గత వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంపై ధర్మ ధ్వజ స్థాపన చేయడం చిరకాలం తనకు గుర్తుండిపోతాయని చెప్పారు.


వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదం, మధురలోని కృష్ణజన్మభూమి వివాదం తదుపరి లక్ష్యం అనుకోవచ్చా అని అడిగినప్పుడు తాము అన్ని ప్రాంతాలకు చేరుకుంటామని, ఇప్పటికే చేరుకున్నామని ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. ప్రతి సమాజం తమ వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తుందని, తమ ప్రయత్నాలు ఆ దిశగానే ఉంటాయని చెప్పారు. అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము రుణపడి ఉంటామని, ఈ రోజు (డిసెంబర్ 6) చాలా కీలకమైన రోజని చెప్పారు. వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) తొలగించామని, తద్వారా దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. భవిష్యత్తులో ఏది జరిగినా ఇదే తరహాలో తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు.


అభివృద్ధి, శాంతి భద్రతలు..

ఉత్తరప్రదేశ్ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై అడిగిన ప్రశ్నకు యోగి సమాధానమిస్తూ, 2027 నాటికి భారత్ 5 ట్రిలయన్ డాలర్లు, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించారని, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ కోసం గత ఆగస్టులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఏకబికిన 27 గంటల పాటు చర్చించామని చెప్పారు. 2029-30 నాటికి ఉత్తరప్రదేశ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు, 2047 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ తప్పనిసరిగా ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో సాధించిన వృద్ధిని తీసుకుంటే తప్పనిసరిగా అభివృద్ధి భారత్-అభివృద్ధి ఉత్తరప్రదేశ్, స్వయం సమృద్ధి భారత్-స్వయం సమృద్ధి ఉత్తరప్రదేశ్ సాధించగలమని తాను నమ్మతున్నట్టు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.


ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులకు అర్థం ఉండేది కాదని, వ్యక్తికి భద్రత లేనప్పుడు పెట్టుబడులు ఎలా భద్రంగా ఉంటాయని యోగి ప్రశ్నించారు. పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు నేరాలు, నేరగాళ్లను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదంటూ జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకువచ్చామని, ఇవాళ మెరుగైన శాంతిభద్రతల పరిస్థితితో తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తమ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి సారించిందని, ఈ దిశగా మెట్రో, ఎక్‌ప్రెస్‌వేస్, విమానాశ్రయాల్లో ప్రగతి సాధించామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రాబోయే రెండు నెలలో ప్రారంభించనున్నామని చెప్పారు. వీటితో పాటు అర్బనైజేషన్‌పై దృష్టి పెట్టామని, పలు హౌసింగ్ సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. బిల్డర్లు, బయ్యర్ల సమస్యలను పరిష్కరించామని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క నొయిడా, గ్రేటర్ నొయిడాలోనే 3.5 లక్షల బయ్యర్లు ఉన్నారని, వారి డబ్బులు బిల్డర్ల చేతుల్లో చిక్కుకుపోయాయని చెప్పారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నందున తొలి సంవత్సరంలోనే 1.25 లక్షల మంది ప్రజలు ఇళ్లు సాధించుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ భద్రతకు ఢోకాలేదని మహిళలు సంతృప్తిగా ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి వారు లబ్ధి పొందుతున్నారని వివరించారు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 09:59 PM