Share News

Delhi-NCR Stray-dogs: వీధి కుక్కల అంశం విస్తృత ధర్మాసనానికి బదిలీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 08:48 PM

న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది.

Delhi-NCR Stray-dogs: వీధి కుక్కల అంశం విస్తృత ధర్మాసనానికి బదిలీ
Supreme court

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఉత్తర్వులను తాము పరిశీలిస్తామని సీజేఐ (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai) బుధవారంనాడు హామీ ఇచ్చిన కొద్ది గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశాన్ని త్రిసభ్య విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. సీజేఐ ఆదేశాలతో న్యాయమూర్తులు విక్రమ్ ‌నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారంనాడు ఈ అంశంపై విచారణను చేపట్టనుంది.


న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. వీధి కుక్కల కోసం రాబోయే ఎనిమిది నెలల్లో సుమారు 5,000 వీధి కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్‌ను కోర్టు ఆదేశించింది. షెల్టర్ల సామర్థ్యం పెంచుతూ దీర్ఘకాలిక ప్లాన్ అమలు చేయాలని సూచించింది. ప్రజా భద్రత ముఖ్యమని, ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని పేర్కొంది. ఈ చర్యలను అడ్డుకునేందుకు ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.


కాగా, సుప్రీం తీర్పుపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తదితరులు కోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపారు. తీర్పును సమీక్షించి, సవరణలు చేయాలని నటుడు జాన్ అబ్రహం సీజేఐకి లేఖ రాశారు. ఈ క్రమంలో విచక్షణారహితంగా కమ్యూనిటీ డాగ్స్‌ను చంపకుండా గతంలో కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయవాది ఒకరు సీజేఐ ముందు ప్రస్తావించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడే వీధి కుక్కలను తొలగించాలంటూ ఆగస్టు 11న కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది సబ్మిషన్‌పై సీజేఐ బీఆర్ గవాయ్ స్పందిస్తూ, వేరే న్యాయమూర్తుల ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున ఆ తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

వీధి కుక్కలపై సుప్రీం తీర్పును పరిశీలిస్తాం

కేదార్‌‌నాథ్ యాత్ర మూడు రోజులు నిలిపివేత

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 08:58 PM