Rahul Gandhi on Amit Shah: ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:11 PM
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా.. అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారని, చేతులు కూడా వణికాయని చెప్పారు రాహుల్.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సంస్కరణల(Election Reforms)పై లోక్సభ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) ఆందోళనకరంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Congress MP Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఆయన భాష కూడా స్పష్టంగా లేదని.. అమిత్ షా ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు రాహుల్.
'బుధవారం నాటి సమావేశంలో.. ఓటు చోరీ(Vote Theft) అంశంపై మీడియా ముందు నేను చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్(Parliament)లో చర్చకు తీసుకురావాలని ఆయన(అమిత్ షా)కు సవాల్ విసిరాను. ఆ సమయంలో ఆయన ఆందోళనకరంగా కనిపించారు. భాష కూడా సరిగ్గా లేదు. చేతులు వణుకుతూ కనిపించాయి. ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ఎలాంటి ఆధారాలూ చూపడం లేదు. మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. మీరూ ఆ విషయాన్ని గమనించే ఉంటారు' అని అమిత్ షానుద్దేశించి రాహుల్ అన్నారు.
అయితే.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు స్పందిస్తూ.. నిన్న చర్చలు జరిగే సమయానికి అమిత్ షా అనారోగ్యానికి గురయ్యారని తెలిపాయి. లోక్ సభలో ప్రసంగించేందుకు లేచి నిల్చున్నప్పుడు ఆయన 102 డిగ్రీల జ్వరంతో ఇబ్బంది పడ్డారని చెప్పాయి. సమావేశం ప్రారంభానికి ముందే ఆయన్ను వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారని పేర్కొన్నాయి.
కాగా, ఈ చర్చ సందర్భంగా.. అమిత్ షా సుమారు 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఓటు చోరీ అంశంపై రాహుల్ చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారాయన. కాంగ్రెస్ పార్టీయే ఓటు చోరీకి పాల్పడిందని, నాయకత్వ లోపమే ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం చెందడానికి కారణమని షా విమర్శించారు.
ఇవీ చదవండి:
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్