Priyanka Gandhi on PM Modi: మేము మీలా కాదు.. దేశం కోసమే ఉన్నాం: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:43 PM
లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చ జరగడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. బీజేపీ ఎంపీలు పదే పదే ఆ విషయమై చర్చించడం.. బెంగాల్లో రాబోయే ఎన్నికలకు ఆజ్యం పోసినట్టుందని విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ(Lok Sabha)లో వందేమాతరం గేయంపై వాడి వేడి చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra).. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సహా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాల కంటే ఎన్నికలకే బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. సభలో పదే పదే అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తూ పాలక పార్టీ ఎన్నికల హడావుడిగా ముందుకు సాగుతోందని.. కానీ, కాంగ్రెస్(Congress) జాతీయ విలువల కోసం పోరాడుతుందని ఆమె అన్నారు. దేశ ప్రయోజనాలపై పోరాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు ప్రియాంక.
'మీరు ఎన్నికల కోసమే ఇక్కడ కూర్చొన్నారు. కానీ మేము దేశం కోసం ఉన్నాం. ఎన్నికల్లో పరాజయాలనేవి పార్లమెంటు(Parliament)లో పార్టీ స్వరం వినిపించకుండా ఆపలేవు. మేము ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నా.. ఇక్కడే కూర్చుని మీతో పోరాడుతూనే ఉంటాం' అని ప్రియాంక చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో(Parliament Winter Session 2025) వందేమాతరం(Vande Mataram) గేయంపై చర్చించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. ప్రభుత్వం.. ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తోందని బీజేపీ(BJP) ఎంపీలపై ఆమె ధ్వజమెత్తారు. వందేమాతరాన్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదన్న ఆమె.. పశ్చిమ్ బెంగాల్లో(West Bengal) రాబోయే ఎన్నికల సందర్భంగానే ఈ అంశాన్ని లేవనెత్తినట్టుందని మండిపడ్డారు. బెంగాల్ ఎలక్షన్స్కు ఈ చర్చలతో ఆజ్యం పోస్తున్నారని విమర్శించారామె. వందేమాతరం.. ధైర్యం, త్యాగానికి చిహ్నమని ఈ సందర్భంగా గుర్తుచేశారు ప్రియాంక. 'ఈ జాతీయ గేయం.. మనకు ధైర్యాన్ని గుర్తు చేస్తుంది, ఇది మన ఆత్మలో ఒక భాగం' అని వందేమాతరం ప్రాముఖ్యతను గురించి ప్రియాంక వివరించారు.
ఇవీ చదవండి: