Modi-Wang Yi Meet: భారత్-చైనా సంబంధాల్లో మలుపు.. మోదీ-వాంగ్ యి సమావేశం
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:43 PM
దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైన దౌత్య సమావేశం జరిగింది. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని స్వాగతించారు. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త బాటలు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్-చైనా సంబంధాలలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇది దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఆగస్టు 19, 2025న జరిగింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని సాదరంగా ఆహ్వానించారు. ఇది కేవలం ఒక సాధారణ టీ సమావేశం మాత్రమే కాదు. అత్యంత కీలకమైన దౌత్య సమావేశమని (Modi-Wang Yi Meet) చెప్పవచ్చు.
ఐదేళ్ల తర్వాత..
ఎందుకంటే రెండు దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా 2020లో లడఖ్ గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు మారింత ఉద్రిక్తంగా మారాయి. అలాంటి సమయంలో ఇద్దరు ప్రముఖ నేతలు ఒకే టేబుల్ వద్ద కలవడం ఆసక్తికరంగా మారింది.
ఎందుకు భేటీ?
వాంగ్ యి మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇది భారత్-చైనా సంబంధాలలో పురోగతి సాధించే విషయమని చెప్పొచ్చు. ఈ సమావేశం సైనిక, దౌత్యపరమైన చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించింది. 2020 నుంచి రెండు వైపులా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు కష్టపడుతున్నాయి. దీనిని జాగ్రత్తగా నివారించడానికి చర్చించనున్నారు. ఈ ఇద్దరు నాయకులు శాంతిని కాపాడడం సహా సరిహద్దు సమస్యలను పరిష్కరించడం వంటి పలు అంశాల గురించి చర్చించి ఉండవచ్చు.
రెండు దేశాల మధ్య
దీంతోపాటు రాబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ గురించి కూడా చర్చించే ఛాన్సుంది. SCO అనేది భారత్, చైనా, రష్యా వంటి దిగ్గజ దేశాలను కలిగి ఉన్న ఒక ప్రధాన ప్రాంతీయ సమూహం. ఇది భద్రత, వాణిజ్యం, సహకారం గురించి చర్చించుకునే వేదిక. మోదీ, వాంగ్ యి ఈ సమ్మిట్ కోసం ఎజెండాను నిర్ణయించనున్నారు. దీంతోపాటు రెండు దేశాల మధ్య సహకారాన్ని ఎలా బలోపేతం చేయడం, ఇటీవలి ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అంత ఈజీ కాదు
ఈ సమావేశం ఎందుకు ముఖ్యమంటే భారత్, చైనా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు. వీటి సంబంధాలు ఆసియా సహా ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి. వాణిజ్యం నుంచి భద్రత వరకు, ఈ రెండు దేశాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానిపై మరికొన్ని దేశాల నిర్ణయాలు కూడా మారతాయి. 2020 ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించడం అంత ఈజీ కాదు, కానీ ఈ సమావేశం మాత్రం ఒక సానుకూల విషయమని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి