Bihar Elections: 125 సీట్లలో ఆర్జేడీ పోటీ.. వెలువడనున్న అధికారిక ప్రకటన
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:43 PM
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) 'ఇండియా' కూటమి (INDIA bloc) భాగస్వాముల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన ఫార్ములా ఖరారైనట్టు సమాచారం. పాట్నాలో మంగళవారంనాడు జరిపే మీడియా సమావేశంలో సీట్ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కూటమిలో సీనియర్ భాగస్వామిగా రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఉండనుంది. కాంగ్రెస్ 55 నుంచి 57 సీట్లకు పరిమితం కానున్నట్టు తెలుస్తోంది.
ఫార్ములా ఇదే..
సీట్ల కేటాయింపు ఫార్ములా ప్రకారం ఆర్జేడీ 125 సీట్లలో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ 55 నుంచి 57 సీట్లలో పోటీ చేస్తుంది. వామపక్ష పార్టీలకు 35 సీట్లు కేటాయిస్తున్నారు. ముఖేష్ సాహ్ని వీఐపీ పార్టీకి 20 సీట్లు, పశుపతి పరస్కు 3 సీట్లు, జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM)కు రెండు సీట్లు కేటాయించనున్నారు. పంపకాల ప్రక్రియ సజావుగానే ఉందని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు చెబుతున్నప్పటికీ సీట్ల పంపకాలపై విభేదాలు ఇంకా తొలగలేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా పోటీ చేస్తున్న కొన్ని సీట్లు కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఉదాహరణకు పాట్నా జిల్లాలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి ఆ సీట్లను కోరుకోవడం లేదు. దీంతో గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న సీట్లు ఇప్పుడు ఆర్జేడీ ఖాతాలోకి వెళ్లనున్నారు.
బరిలోకి జేఎంఎం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జేఎంపీ ఎంట్రీ ఇస్తోంది. జార్ఖాండ్ సరిహద్దు ప్రాంతాల్లో పోటీకి సిద్ధమవుతోంది. జేఎంఎం ఎక్కువ సీట్లు అడుగుతున్నప్పటికీ సీట్ల పంపకాల ఫార్ములా ప్రకారం ఆ పార్టీకి 2 సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకే వైపు విజయ్ చూపు.. పొత్తుపై రహస్య మంతనాలు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Latest Telangana News and National News