JK Rajya Sabha Results: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు.. నేషనల్ కాన్ఫరెన్స్కు 3, బీజేపీకి 1
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:33 PM
జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభ (Rajya Sabha)కు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) 3 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. నాలుగో సీటును బీజేపీ దక్కించుకుని తమ ఉనికిని చాటుకుంది. మొత్తం 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. శ్రీనగర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్లో పోలింగ్ జరుగగా, సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.

విజేతలు వీరే..
జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) నుంచి ముగ్గురు విజేతలుగా నిలిచారు. చౌదరి మహమ్మద్ రంజాన్ మొదటి రాజ్యసభ సీటును గెలుచుకోగా, రెండో సీటును సజ్జాద్ అహ్మద్ కిచ్లూ, మూడో రాజ్యసభ సీటును జీఎస్ (షమ్మీ) ఒరెరాయ్ గెలుచుకున్నారు. ఈ మూడు సీట్లనూ ఎన్సీ సునాయాసంగా గెలుచుకోగా, నాలుగో సీటుకు పోటీ నెలకొంది. ఈ సీటుకు ఎన్సీ అభ్యర్థి ఇమ్రాన్ నబి దర్, బీజేపీ నేత సత్ శర్మ పోటీ పడగా, బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో గెలుపొందారు.
జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాల్లో 3 సీట్లు గెలుచుకోవడంతో ఎన్సీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు సైతం ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవడంతో సంబరాలు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ..
మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి