Heavy Rains Schools Holiday: వర్షాల ఎఫెక్ట్..ఈ ప్రాంతాల్లో నేడు స్కూల్స్ బంద్..
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:45 AM
దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక రాష్ట్రాల్లో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాలు అనేక ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ నీటితో (Heavy Rains School Holiday) నిండిపోయి, ట్రాఫిక్ జామ్, రోజువారీ జీవనంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) ఈరోజు ఢిల్లీ NCR, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ, జమ్మూ కశ్మీర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
యూపీలో స్కూళ్లకు సెలవులు
ఈ హెచ్చరికల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లోని జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ 3న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్, షామ్లీ, ముజఫర్నగర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్షహర్, ఘజియాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 3న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జిల్లా అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా రోడ్లు మునిగిపోవడం, పిల్లలు స్కూళ్లకు రావడం కష్టమవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సెలవులు
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మొదట సెప్టెంబర్ 2న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులను సెప్టెంబర్ 3 వరకు పొడిగించారు. నైనిటాల్లో కూడా వర్ష హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేశారు.
హిమాచల్లో స్కూళ్లకు హాలిడే
హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో సెప్టెంబర్ 3న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేయాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పంజాబ్లో వర్షాలు, వరదలు
పంజాబ్లో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడ కాలేజీలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లకు సెప్టెంబర్ 3 వరకు సెలవు ప్రకటించారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేస్తూ, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల భద్రత బాధ్యత సంబంధిత అడ్మినిస్ట్రేషన్దేనని, అందరూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు.
హర్యానాలో కూడా..
హర్యానాలోని చండీగఢ్లో భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కైథల్ జిల్లాలోని ఘగ్గర్ నది నీటి మట్టం పెరగడం, నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల గుహ్లా బ్లాక్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 3న సెలవు ఇచ్చారు. ఈ ఆదేశాలను కైథల్ డిప్యూటీ కమిషనర్ ప్రీతి జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి