Siddaramaiah: ఓట్ చోరీ వల్లే అప్పట్లో ఓడిపోయా.. కాంగ్రెస్ను చిక్కుల్లో పడేసిన సిద్ధరామయ్య
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:41 PM
1991 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగడం వల్లే తాను ఓడిపోయానని సిద్ధరామయ్య చెప్పారు. అప్పట్లో జనతా దళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఆయన నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
బెంగళూరు: ఓట్ చోరీ (Vote Chori) ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ బిహార్లో 'ఓట్ అధికార్ యాత్ర' కొనసాగిస్తున్న తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆ పార్టీని చిక్కుల్లో పడేసే వ్యాఖ్యలు చేశారు. 1991 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగడం వల్లే తాను ఓడిపోయానని చెప్పారు. అప్పట్లో జనతా దళ్ సెక్యులర్ అభ్యర్థిగా సిద్ధరామయ్య నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
సిద్ధరామయ్య ప్రత్యర్థిగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన బసవరాజ్ పాటిల్ అన్వారి గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి అన్వారి 1989లో జేడీఎస్ టికెట్పై గెలిచి 1991లో కాంగ్రెస్లో చేరారు. 1991 ఎన్నికల్లో అన్వారికి 2.41 లక్షల ఓట్లు పోల్ కాగా.. 11,200 ఆధిక్యంతో సిద్ధరామయ్యపై గెలిచారు. దీంతో కర్ణాటక హైకోర్టును సిద్ధరామయ్య ఆశ్రయించారు. కౌంటింగ్ అధికారులు 22,243 ఓట్లను చెల్లవంటూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కోర్టులో సవాలు చేశారు. ఆ ఓట్లతో తాను గెలిచి ఉండేవాడినని అన్నారు. ఆ విషయాన్ని తాజాగా సిద్ధరామయ్య గుర్తుచేస్తూ కర్ణాటక మాజీ అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ కమార్ ద్వారా కేసు కూడా దాఖలు చేశానని చెప్పారు. రవివర్మ కుమార్ సన్మానం సందర్భంగా సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు చేశారు.
కాగా, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. అప్పుడు కాంగ్రెస్ ఓటు చోరీపై పోరాడిన వ్యక్తి, ఇప్పుడు అదే కాంగ్రెస్ తరఫున ఓట్ అధికార్ యాత్రలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన సొంత పార్టీ తీరుని బయటపెట్టారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అమిత్ షా తల నరికి టేబుల్పై పెట్టాలి... మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి