Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. వారంతా వలస పక్షులు
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:36 AM
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
- అన్వర్రాజా, మైత్రేయన్పై ఈపీఎస్ విసుర్లు
చెన్నై: తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీలు అన్వర్రాజా, మైత్రేయన్లను పార్టీ నుంచి తొలగించడంపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఈపీఎస్ సమాధానమిస్తూ, పార్టీ నిబంధనలను అతిక్రమించిన వారిని పార్టీ నుంచి తొలగించడం, క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ చేర్చుకోవడం రాజకీయాల్లో కొత్తకాదన్నారు.
పార్టీ నిబంధనలకు కట్టుబడకుండా యధేచ్ఛగా వ్యవహరించినందువల్లే అన్వర్రాజా, మైత్రేయన్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరే హక్కుందని, ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన నిబంధనల ప్రకారమే పార్టీని ముందుకు తీసుకెళ్తుంటామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించి అన్నివిధాలా లబ్దిపొందినవారెంతో మంది అన్నాడీఎంకేకు వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లో చేరారని, అయితే అలాంటివారిలో కొంతమంది మాత్రమే ఆయా పార్టీల్లో గుర్తింపు పొందారని, మిగతావారు ఏమైపోయారో కూడా తెలీదన్నారు.
అన్వర్రాజా మైత్రేయన్లను రెండుసార్లు పార్టీ నుండి తొలగించామని, వారు క్షమాపణ చెప్పడంతో మళ్ళీ పార్టీలో చేర్చుకున్నామని, ఇలాంటి వలసపక్షులు ఎక్కడా నిలకడగా ఉండలేరన్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో మరికొన్ని పార్టీలు చేరే అవకాశముందని, 8 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారం మారుతుందని ఆయన నమ్మకం వ్యక్తంచేశారు. తిరుపత్తూరు జిల్లాలోని రైతులు, పాఠశాల విద్య, ప్రైవేటు బస్సులు తదితర సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తనకు తెలిపారని,

అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి కోరికలతో పాటు సాగు కాలువల్లో పూడికతీయించి సాగునీటిని సరఫరా చేసే చర్యలు చేపడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో డీఎంకే ప్రభుత్వం సుమారు 50 కొత్త పథకాలను ప్రకటించిందని, వాటికి ప్రత్యేక కమిటీలను కూడా నియమించిందని, అయితే ఆ కమిటీలు పనిచేయడంలేదని ఈపీఎస్ ఆరోపించారు. ఈపీఎ్సతో మాజీమంత్రి కేసీ వీరమణి, ఎంపీ తంబిదురై తదితరులున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News