Madhya Pradesh: ఎయిర్ బెలూన్లో మంటలు.. సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:47 PM
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Dr. Mohan Yadav)కు శనివారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్ (hot air ballon)కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. మంద్సౌర్లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి, ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో వెంటనే ఆయణ్ని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది తరలించారు.
ప్రమాదం కాదన్న అధికారులు
కాగా, ఈ ఘటనపై మంద్సౌర్ జిల్లా కలెక్టర్ అదితి గార్గ్ వివరణ ఇచ్చారు. మంటలు వచ్చినట్టు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పని అన్నారు. బెలూన్ను పరిశీలించేందుకే సీఎం వచ్చారని, సీఎం బెలూన్ ఎక్కలేదని చెప్పారు. మంటలు రావడంపై మాట్లాడుతూ, బెలూన్ను లిఫ్ట్ చేసేందుకు అందులోని గాలిని హీట్ చేయడం అనేది స్టాండర్డ్ ప్రాసెస్ అని చెప్పారు. ఏడేళ్ల అనుభవం ఉన్న బెలూన్ పైలెట్ మహమ్మద్ ఇర్ఫాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెలూన్ కోసం ఎల్పీజీ, ఫైర్ప్రూఫ్ కెవ్లార్ మెటీరియల్ వాడతామని, పూర్తి భద్రతా ప్రమాణాలకు లోబడి ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మణిపూర్ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని
For More National News and Telugu News