Fadnavis On Vote Chori : ఓటమికి తప్పుడు సాకులు చెప్పొద్దు.. రాజ్ఠాక్రేకు సీఎం క్లాస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:55 PM
రాహుల్ గాంధీ వివాదాస్పద 'ఓట్ చోరీ' ఆరోపణలను పుణేలో శనివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో రాజ్ఠాక్రే సమర్ధించారు. ఎన్నికల్లో అవకతవకలు కొత్త అంశమేమీ కాదని, 2016-17లో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) సమర్ధించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తప్పుపట్టారు. ఎన్నికల వైఫల్యంపై నిజమైన కారణాలను అన్వేషించకుండా తన మద్దతుదారులను ఠాక్రే తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
'వాళ్లు తమను తాము స్వాంతన పరుచుకునేందుకు, ఎన్నికల్లో నెగ్గిఉండేవాళ్లమంటూ కార్యకర్తలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమికి కుట్ర జరిగిందంటూ చెప్పుకోవడం ద్వారా కార్యకర్తలు చెదిరిపోకుండా చూడాలనుకుంటున్నారు' అని ఫడ్నవిస్ అన్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను అవమానించడం మాననంత కాలం వాళ్లు ఎన్నికల్లో గెలవలేరని పేర్కొన్నారు.
రాజ్ఠాక్రే ఏమన్నారు?
రాహుల్ గాంధీ వివాదాస్పద 'ఓట్ చోరీ' ఆరోపణలను పుణేలో శనివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో రాజ్ఠాక్రే సమర్ధించారు. ఎన్నికల్లో అవకతవకలు కొత్త అంశమేమీ కాదని, 2016-17లో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని అన్నారు. 2014 నుంచి ఎన్నికల అవకతవకలు, అక్రమాలతోనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ఆరోపించారు.
ఆ రెండూ చేయని రాహుల్
బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన మీడియా సమావేశంలో విమర్శించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో అవకతలు జరగడాన్ని ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితాలో లక్షలకు పైగా నకిలీ ఓట్లు చేర్చారని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. తన ఆరోపణలపై రాహుల్ అఫిడవిట్ సమర్పించాలని, అలా కానీ పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే రాహుల్ ఇంతవరకూ ఆ రెండూ చేయలేదు. ఓట్ చోరీ ఆరోపణలను కొనసాగిస్తూ బిహార్లో 'ఓటర్ అధికార్ యాత్ర'ను నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం
For More National News And Telugu News