Bomb Threat Schools: పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో విద్యార్థులు, పేరెంట్స్
ABN , Publish Date - Aug 18 , 2025 | 09:24 AM
దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం డిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపించింది.
ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈసారి, ద్వారకలోని డెల్హీ పబ్లిక్ స్కూల్ (DPS)కి సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు స్కూల్కు చేరుకుని తనిఖీలు (Bomb Threat Schools) చేస్తున్నాయి. ఈ బెదిరింపు ఒక Gmail ID నుంచి వచ్చిన ఈమెయిల్ రూపంలో ఉందని, దీంతోపాటు మరికొన్ని స్కూళ్లకు కూడా వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మరికొన్ని స్కూళ్లకు కూడా..
ద్వారకలోని మరో రెండు స్కూల్స్ మోడరన్ కాన్వెంట్ స్కూల్ (సెక్టార్-4), శ్రీరామ్ వరల్డ్ స్కూల్ (సెక్టార్-10) కూడా ఇలాంటి బెదిరింపు ఈమెయిళ్లు అందాయని తెలిపాయి. ఈ ఘటన ఒక్క ఢిల్లీకే పరిమితం కాదు. గత జూలైలో బెంగళూరులోని 40 ప్రైవేట్ స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
ఆ ఈమెయిల్లో క్లాస్రూమ్లలో ట్రైనైట్రోటోలుయీన్ (TNT) అనే పేలుడు పదార్థం అమర్చామని, ఒక్క ఆత్మ కూడా బతకదని భయానకంగా రాసి ఉంది. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బాధపడటం నేను నవ్వుతూ చూస్తానని ఆ ఈమెయిల్లో ఉంది. కానీ బెంగళూరులో జరిగిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ దొరకలేదు.
ఇవి కేవలం బెదిరింపులేనా?
ఇప్పటివరకూ వచ్చిన బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత గురించి ఆలోచిస్తే ఈ బెదిరింపులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం అవుతుంది. మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిశీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై, BJP నేతృత్వంలోని స్థానిక పరిపాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీలో పాలనా విభాగాలూ BJP చేతిలోనే ఉన్నాయి, కానీ పిల్లల భద్రతను కాపాడలేకపోతున్నారని ఆరోపించారు.
అధికారులు ఏం చేస్తున్నారు ?
ప్రతి బెదిరింపునూ సీరియస్గా తీసుకుని అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. స్కూళ్లను ఖాళీ చేయడం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో సోదాలు చేయడం ఇప్పుడు సాధారణ విధానంగా మారింది. ఆదివారం DPS ద్వారకకు వచ్చిన బెదిరింపు కాల్ వెనుక ఎవరున్నారో కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి