Goa Zilla Panchayat Elections: గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్
ABN , Publish Date - Dec 22 , 2025 | 08:18 PM
జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ-ఎంజీపీ (ఎన్డీయే) కూటమి నుంచి గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు.
పనజి: గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో (Goa Zilla Panchayat Elections 2025) బీజేపీ (BJP) ఘనవిజయం సాధించింది. 50 సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు 5 సీట్లు గెలుచుకున్నారు.
మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎండీపీ) రెండు స్థానాల్లో గెలుపొందగా, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్జీపీ) ఒక్కో సీటు చెప్పున గెలుచుకున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంజీపీతో కలిసి పోటీ చేయగా, జీఎఫ్పీ పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేసింది. 2027లో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరగడం రాజకీయ ప్రాధాన్యతను సతరించుకుంది. గోవాలో 2012 నుంచి బీజేపీ అధికారంలో ఉంది.
బీజేపీ విక్టరీపై సీఎం స్పందన
జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ-ఎంజీపీ (NDA) కూటమి నుంచి గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ప్రజలు నిర్ణయాత్మక తీర్పునిచ్చారని అన్నారు. 'గోవాలో బీజేపీ నెంబర్ 1. ఇంతటి ఘనవిజయంతో బీజేపీని ఆశీర్వదించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సీఎం పేర్కొన్నారు.
గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈనెల 20న జరుగగా, 70.81 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 50 నియోజకవర్గాల్లో 226 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్కు నోటీసులు
'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి