Banaras University: బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిపై హత్యాయత్నం
ABN , Publish Date - Aug 14 , 2025 | 09:49 PM
గత నెల 28న పట్ట పగలే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కిరాయి మూకలు చేసిన హత్యాకాండకు విశ్వవిద్యాలయం ఉలిక్కిపడింది. మోటార్ సైకిల్ పై వెళుతున్న శ్రీరామచంద్రమూర్తిని వెనక వైపు నుండి గుద్ది కింద పడేశారు. ఆ తర్వాత విచక్షణా రహితంగా దాడి చేశారు.
న్యూఢిల్లీ: వారణాసిలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిపై హత్యాయత్నం రాష్ట్రమంత కలకలం సృష్టించింది. తెలుగువారి పరువు ప్రతిష్ట త్రివేణి సంగమంలో కలుపుతూ.. ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు పన్నిన హత్యాయత్న కుట్రకు మరో తెలుగు ఆచార్యుడు చల్లా శ్రీరామచంద్రమూర్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పదవీ వ్యామోహం..
గత నెల 28న పట్టపగలే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కిరాయి మూకలు చేసిన హత్యాకాండకు విశ్వవిద్యాలయం ఉలిక్కిపడింది. మోటార్ సైకిల్ పై వెళుతున్న శ్రీరామచంద్రమూర్తిని వెనక వైపు నుండి గుద్ది కింద పడేశారు. ఆ తర్వాత విచక్షణా రహితంగా దాడి చేశారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు పట్టుకున్నాక ఈ కుట్ర విషయం బయటపడింది. గతంలో తెలుగు శాఖధిపతిగా పనిచేసిన బూదాటి వెంకటేశ్వర్లు ప్రస్తుత శాఖధిపతిగా ఉన్న చల్లా శ్రీరామచంద్రమూర్తిని తప్పిస్తే తిరిగి ఆ పదవిని తానే పొందవచ్చనే ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులపై కాల్పులు..
ఆచార్యుడిపై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రమోద్ కుమార్ను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ప్రమోద్ కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో కాలి గాయంతో నిందితుడు దొరికిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రమోద్తో పాటు హిందూ బెనారస్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన పూర్వ విద్యార్థి భూత్పూర్ భాస్కర్ కూడా కుట్రలో పాలుపంచుకున్నట్టు తేల్చామన్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా నుండి భాస్కర్ను అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్పై వారణాసికి తీసుకొచ్చామని చెప్పకొచ్చారు.
చిక్కిన నిందితుడు..
కాంట్రాక్ట్ కిల్లర్ ప్రమోద్ కుమార్ అలియాస్ గణేష్ పాసి ప్రయాగ్ రాజ్కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన జౌన్పూర్కు చెందిన వేదాంత్ భూషణ్ మిశ్రా అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. కాశీ జోన్ అడిషనల్ సీపీ టి.శరవణన్ తెలిపిన వివరాల ప్రకారం.. దఫీ ప్రాంతంలోని సత్కార్ హోటల్ సమీపంలో ఒక నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో, లంక పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రాజ్ కుమార్ శర్మ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. పోలీసులను చూసిన నిందితుడు కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు, కానీ పోలీసులు ఎదురుకాల్పుల్లో అతని కాలికి గాయమై పట్టుబడ్డాడని తెలిపారు. అతని నుండి ఒక తుపాకీ, మందు గుండు సామగ్రి, నగదు స్వాధీనం చేసుకున్నారని, ఒక ప్రణాళిక ప్రకారం ఆచార్య చెల్లా శ్రీరామచంద్రమూర్తిని హత్య చేయడానికి వారు నిర్ణయించుకున్నట్టు గుర్తించామని సీపీ వెల్లడించారు.
పక్కా ప్లానింగ్తో..
2016 నుండి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లుతో సాన్నిహిత్యంగా ఉంటున్న భూత్పూర్ భాస్కర్ ను, మైసూరులో పనిచేస్తున్న కాసిం బాబును బూదాటి వెంకటేశ్వర్లు పిలిపించుకున్నాడని, అతని ఆదేశాల ప్రకారమే ముందుగా రెక్కీ నిర్వహించి, అతను మోటార్సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బిర్లా హాస్టల్ సమీపంలో ఇనుప రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో శ్రీరామచంద్రమూర్తి రెండూ చేతులు విరిగిపోయాయని చెప్పారు. అయితే దాడి అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుండి పారిపోయారన్నారని వివరించారు.
నేరం ఒప్పుకున్న నిందితుడు..
బూదాటి వెంకటేశ్వర్లు సూచనల మేరకు జూలై 25న భాస్కర్ తన స్నేహితుడు మహ్మద్ కాసిమ్తో కలిసి శ్రీరామచంద్రమూర్తిని హత్యచేసే ప్రణాళికలు వేశారని సీపీ చెప్పుకొచ్చారు. అమలు చేయడానికి విమానంలో వారణాసికి చేరుకున్నారన్నారు. వారు ఒక హోటల్లో బస చేశారని, కాసిమ్ కిరాయి అంతకుడు ప్రమోద్ను పిలిచి ప్రణాళికను ఖరారు చేశాడని పేర్కొన్నారు. ప్రమోద్ మిశ్రా, సూరజ్ దుబే, ప్రద్యుమన్ యాదవ్, ఘాజీపూర్ జిల్లాకు చెందిన విశాల్ యాదవ్లను నియమించాడు. అనంతర పరిణామాల్లో, వారు మూర్తిని రెక్కీ చేసి, మోటార్సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బిర్లా హాస్టల్ సమీపంలో ఇనుప రాడ్లతో దాడి చేశారు. మూర్తి రెండు చేతులు విరిగిపోగా, ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటనలో అరెస్టులు ప్రారంభమైన తర్వాత బూదాటి వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడని తన మొబైల్ నంబర్లను స్విచ్ ఆఫ్ చేశాడని అడిషనల్ సీపీ తెలిపారు. బూదాటి వెంకటేశ్వర్లుతో పాటు ఇతర నిందితులైన సూరజ్ దుబే, ప్రద్యుమ్న యాదవ్, విశాల్ యాదవ్, కాసిమ్లను పట్టుకునేందుకు బృందాలను నియమించామని సీపీ చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి హత్య కుట్రలో వేదాంత కుమార్ మిశ్ర తన పాత్రను అంగీకరిస్తూ.. తన పాత స్నేహితుడైన కాసింతో కలసి మూర్తిని హత్య చేయడానికి డబ్బు ఆఫర్ చేశాడని ఒప్పుకున్నాడని సీపీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం..
ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు..ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..