Asaduddin Owasi: మా వద్ద బ్రహ్మోస్ ఉన్నాయ్... పాక్ ప్రధానిపై ఒవైసీ మండిపాటు
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:46 PM
శత్రువుకు తిరుగులేని గుణపాఠం చెబుతామంటూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ తిప్పికొట్టారు. ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంతమాత్రం పనిచేయవని అన్నారు.
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై తాజా హెచ్చరికలు చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఘాటుగా జవాబిచ్చారు. నాన్సెన్స్ మాటలు మాట్లాడొదన్నారు. 'మా వద్ద బ్రహ్మోస్ ఉన్నాయ్' అంటూ హెచ్చరించారు.
శత్రువుకు తిరుగులేని గుణపాఠం చెబుతామంటూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మాట్లాడుతూ.. 'మా వద్ద బ్రహ్మోస్ (క్షిపణలు) ఉన్నాయి. ఆయన ఇలాంటి చెత్తమాటలు మాట్లాడకూడదు. ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంతమాత్రం పనిచేయవు. అయిందేదో అయింది' అని అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ 'అణు' హెచ్చరికలు చేయడాన్ని కూడా ఒవైసీ ఇంతకుముందు తిప్పికొట్టారు. భారత్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం గర్హనీయమని అన్నారు. అది కూడా అమెరికా వేదిక నుంచి ఆయన ఈ మాటలు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీనిపై ఎంఈఏ ప్రకటన చేయడం కాకుండా మోదీ ప్రభుత్వం రాజకీయ స్పందనను తెలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంపై తన నిరసన వ్యక్తం చేయడంతో పాటు అమెరికా వద్ద బలంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని అన్నారు.
పాక్ ప్రధాని బెదిరింపులు
ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ప్రధాని షరీఫ్ తన అక్కసు వెళ్లగక్కారు. పాక్లోకి నీరు రాకుండా అడ్డుకుంటే దీనిని యుద్ధ చర్యగా పరిగణిస్తామన్నారు. నీటిని అడ్డుకుంటామని బెదిరిస్తున్న శత్రువుకు ఒకటే చెబుతున్నానని, ఒక్క చుక్క నీరు కూడా తమ నుంచి తీసుకోలేరని, నీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఎప్పటికీ మర్చిపోలేని విధంగా శత్రువుకు గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భారత్కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక
పూరి ఆలయానికి భద్రతా ముప్పు.. గోడలపై హెచ్చరిక రాతలు
For More National News and Telugu News