Trump Tariffs Zelensky Support: ట్రంప్ టారిఫ్లకు జెలెన్స్కీ మద్దతు..రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:32 AM
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయానికి మద్దతు తెలిపారు. రష్యాతో ఇంకా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు న్యాయమైనవే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న కీలక నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ వేసిన టారిఫ్లు న్యాయమేనంటూ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) వ్యాఖ్యానించారు. ఓ అమెరికన్ న్యూస్ చానల్తో మాట్లాడిన జెలెన్స్కీ రష్యా ఎగుమతులు అధ్యక్షుడు పుతిన్ కి ఆయుధంలా పనిచేస్తున్నాయన్నారు. అతని చేతిలోని ఆయుధాన్ని తొలగించాలంటే రష్యా నుంచి ఎలాంటీ ఎనర్జీ సరఫరా అయినా ఆపాల్సిందేనని స్పష్టం చేశారు.
యూరప్పై జెలెన్స్కీ అసంతృప్తి
జెలెన్స్కీ ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న యూరప్ దేశాలపై (Europe Countries) కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే, కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి గ్యాస్, ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది న్యాయం కాదని, రష్యా నుంచి ఎనర్జీ కొనడం ఆపాలని ఆయన సూచించారు. ట్రంప్ ఈ విషయంలో యూరప్ దేశాలపై ఒత్తిడి తెచ్చే నిర్ణయాలు తీసుకోవడం సరైనదని జెలెన్స్కీ వెల్లడించారు.
ట్రంప్-పుతిన్ భేటీ
ఇటీవల అలాస్కాలో ట్రంప్, పుతిన్లు సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి జెలెన్స్కీ (Zelenskyy) మాట్లాడుతూ పుతిన్కు ట్రంప్ ఒక అవకాశం ఇచ్చారు. పుతిన్ ఈ సమావేశంతో తన ప్రభావం చూపించాలని చూశారు. దురదృష్టవశాత్తూ, ఆ సమావేశంలో ఉక్రెయిన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ తనను మాస్కోకు ఆహ్వానించిన విషయాన్ని కూడా జెలెన్స్కీ ప్రస్తావించారు. మా దేశం మీద మిసైల్స్ పడుతున్నప్పుడు నేను మాస్కోకు వెళ్లలేను. పుతిన్ కావాలంటే కీవ్కు రావచ్చని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ స్పందన
ఆదివారం రష్యా (Russia) ఉక్రెయిన్పై మరో పెద్ద దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. కీవ్లోని ప్రభుత్వ కార్యాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ నేను ఈ పరిస్థితితో సంతోషంగా లేను. రష్యాపై కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆగస్టు 15న ట్రంప్, పుతిన్ల సమావేశం యుద్ధ విరమణకు ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో రష్యా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.
భారత్ విధానం మారనుందా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించారు. భారత్పై (India) కూడా 50% సుంకాలు విధించారు, అందులో 25% అదనపు సుంకం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు. భారత్ ఈ నిర్ణయాన్ని అన్యాయమని తప్పుపట్టింది. అయినా భారత్ ఎప్పటిలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ ఉక్రెయిన్ విషయంలో మళ్లీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి