Gen Z Protests In Nepal: నేపాల్ ప్రధాని హోమ్టౌన్ను తాకిన నిరసన సెగలు.. రాళ్లు రువ్విన ఆందోళకారులు
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:44 PM
నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
కాఠ్మాండు: సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్ (Nepal)లో యువత చేపట్టిన ఆందోళన సోమవారంనాడు హింసాత్మకంగా మారింది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా గాయపడ్డారు. నేపాల్ పార్లమెంటు వైపు జనం దూసుకువస్తున్న క్రమంలో భద్రతా దళాలు అడ్డుకోవడం, కాల్పులకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనలకు కేంద్ర స్థానమైన కాఠ్మాండుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని ప్రధాని కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) స్వగ్రామానికి కూడా నిరసన సెగలు తాకాయి. కోషి ప్రావిన్స్లోని దమక్ ప్రాంతంలో ఉన్న ఓలి పూర్వీకుల ఇంటిపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వార్నింగ్ షాట్లు పేల్చారు.

కాగా, నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

సోషల్ మీడియాపై విధించిన నిషేధం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా ఫ్లాట్ 'జనరేషన్ జి' పేరుతో వేలాదిమంది ప్రదర్శకులు కఠ్మాండులోని మైతీఘర్ వద్ద గుమిగూడారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఒక్కసారిగా పార్లమెంటు ఆవరణలోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసులు జలఫిరంగులు, టియర్ గ్యాస్, లైవ్ ఎమ్యునేషన్తో ఆందోళనకారులను అడ్డుకున్నారు. కాగా, నేపాల్లో హింస, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇండియా-నేపాల్ సరిహద్దుల వెంబడి నిఘాను సశస్త్ర సీమాబల్ (SSB) కట్టుదిట్టం చేసింది. అదనపు భద్రతా బలగాలను సైతం మోహరించారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్పైకి దూసుకెళ్లిన యువత..
ట్రంప్ టారిఫ్లకు జెలెన్స్కీ మద్దతు..రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి