Share News

Air Defense: పాక్‌కు అమెరికా ఝలక్‌

ABN , Publish Date - May 10 , 2025 | 05:32 AM

పాకిస్థాన్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించకుండా, భారత్‌ పాకిస్థాన్‌ పై సైనిక చర్యలకు తీవ్ర ప్రతిస్పందన తెలిపింది. పాక్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించగా, వాటిని అడ్డుకుని నాశనం చేసిన భారత్‌కు ప్రపంచంలోని ప్రధాన దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.

Air Defense: పాక్‌కు అమెరికా ఝలక్‌

తాజా సంక్షోభంలో జోక్యం చేసుకోం.. చేతులెత్తేసిన ట్రంప్‌ యంత్రాంగం

ఆయుధాలు వదిలేయాలని ఎవరినీ కోరం

తేల్చిచెప్పిన ఉపాధ్యక్షుడు వాన్స్‌

న్యూయార్క్‌/న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు, భారత్‌ నుంచి దానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా రంగంలోకి దిగి ఆదుకునే మిత్రదేశమైన అమెరికా.. తొలిసారి ఆ దేశానికి మొండిచేయి చూపింది. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్‌.. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌ డ్రోన్లతో భారత స్థావరాలపై దాడికి ప్రయత్నించి చావుదెబ్బ తిన్నది. భారత బలగాలు... చైనా నుంచి పాక్‌ దిగుమతి చేసుకున్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేశాయి. కరాచీపై బ్రహ్మోస్‌ క్షిపణులతో దాడిచేశాయి. భారత్‌ ప్రతిస్పందన ఇంత తీవ్రంగా ఉంటుందని పాకిస్థాన్‌, చైనా, తుర్కియేతో పాటు అమెరికా కూడా ఊహించలేదు. ఉగ్రస్థావరాలపై ఇండియా చేసిన దాడులను సమర్థించిన అధ్యక్షుడు ట్రంప్‌.. కవ్వింపులకు దిగవద్దని పాక్‌ను ముందే హెచ్చరించారు. అయినా 15 భారతీయ నగరాలను డ్రోన్లు, రాకెట్లతో ధ్వంసం చేయడానికి పాక్‌ సైన్యం ప్రయత్నించింది. వాటిని సమర్థంగా అడ్డుకుని నాశనం చేసిన భారత్‌.. నిర్ణయాత్మక దాడులకు సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో గురువారం పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీ్‌ఫకు ఫోన్‌ చేసి ఉద్రిక్తతలు పెంచవద్దని సూచించారు.


అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడం, భారత్‌పై డ్రోన్‌ దాడులను పాక్‌ కొనసాగించడంతో.. అమెరికా ప్రభుత్వం ఇండియాకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోబోమని ఉపాధ్యక్షుడు జేమ్స్‌ వాన్స్‌ శుక్రవారం తేల్చి చెప్పారు. ఆయన ‘ఫాక్స్‌ న్యూస్‌’తో మాట్లాడుతూ.. దౌత్యం ద్వారా ఉద్రిక్తతలు చల్లార్చేందుకు ప్రోత్సహిస్తామని.. కానీ సైనికంగా తలదూర్చబోమని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేయాలని ఎవరినీ కోరబోమని, దౌత్య చర్చలతోనే ఉద్రిక్తతలు చల్లార్చుకోవాలని సూచించారు. పాక్‌కు దన్నుగా నిలిచేది లేదని అమెరికా బహిరంగంగా ప్రకటించడంతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌కు, ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఏమీ పాలుపోవడం లేదు. పైగా ఎప్పుడూ అండగా నిలిచే సౌదీ అరేబియా, యూఏఈ కూడా భారత్‌కే మద్దతిస్తున్నాయి. ఇప్పుడు పాక్‌కు మిగిలింది తుర్కియే, చైనా, అజర్‌బైజాన్‌ మాత్రమే. తాజా సంక్షోభంలో తుర్కియే డ్రోన్లు, రాకెట్లు.. చైనా హెచ్‌క్యూ 9, ఎల్‌వై 80 వంటి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను భారత్‌ నిర్వీర్యం చేసింది. పాక్‌తో కలిసి తాను అభివృద్ధి చేసిన జేఎఫ్‌-17 ఫైటర్లను సైతం నేలకూల్చడం చైనాకు మింగుడుపడడం లేదు. సంక్షోభం తీవ్ర రూపం దాల్చితే పై మూడు దేశాలు మున్ముందు మరింత సాయం అందించడం అనుమానమేనని దౌత్యవేత్తలు అంటున్నారు.


సంక్షోభాన్ని త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలి

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ ట్రంప్‌ సూచన

వాషింగ్టన్‌ : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరుకుంటున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు. రెండు దేశాల నేతలతో ట్రంప్‌నకు సత్సంబంధాలున్నాయని ఆమె గుర్తు చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇప్పటికే భారత్‌-పాక్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని లీవిట్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:32 AM