Share News

Bihar Elections: పంచ పాండవుల కూటమి మాది: అమిత్‌షా

ABN , Publish Date - Oct 25 , 2025 | 03:30 PM

ఖగరియాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు మాత్రమే బిహార్‌ అభివృద్ధిని కాంక్షిస్తుంటారని చెప్పారు. నితీష్ పాలనలో నేరాలు తగ్గాయని, నక్సలిజం నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని చెప్పారు.

Bihar Elections: పంచ పాండవుల కూటమి మాది: అమిత్‌షా
Amit shah in Bihar

ఖగరియా: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సారథ్యంలోని 'మహాఘట్‌బంధన్' (Mahagathbandhan) అధికారంలోకి వస్తే బిహార్‌లో తిరిగి ఆటవిక రాజ్యం (Jungle raj) వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) హెచ్చరించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమిని 'పాండవుల' (Pandavas)తో పోల్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మంచ్ (ఆర్ఎల్ఎం) ఉన్నాయి.


ఖగరియాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు మాత్రమే బిహార్‌ అభివృద్ధిని కాంక్షిస్తుంటారని చెప్పారు. నితీష్ పాలనలో నేరాలు తగ్గాయని, నక్సలిజం నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని చెప్పారు.


'జంగిల్ రాజ్‌ను తిరిగి తెచ్చుకుంటారా? అభివృద్ధిని కోరుకుంటారా? అన్నదే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం. లాలూ-రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం కూడా తిరిగొస్తుంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయితే అభివృద్ధి బిహార్‌ను యావద్దేశం గుర్తిస్తుంది. మీ ఓటు తెలివిగా వేయండి. ఐదుగురు పాండవులతో కూడిన ఎన్డీయేను ఆశీర్వదించి విజయాన్ని చేకూర్చండి' అని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు.


ఆర్జేడీ, కాంగ్రెస్ ఆనువంశిక రాజకీయాలను ప్రోత్సహిస్తుంటాయని అమిత్‌షా తప్పుపట్టారు. లాలూ ప్రసాద్ తన కొడుకును బిహార్ సీఎం చేయాలని అనుకుంటున్నారని, రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానమంత్రిగా చూడాలని సోనియాగాంధీ కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, పాకిస్థాన్‌కు 2016 సర్జికల్ దాడులు, 2019లో ఎయిర్ స్ట్రైక్స్, 2025లో ఆపరేషన్ సిందూర్‌తో గట్టి సమాధానమిచ్చిందని గుర్తుచేశారు. అభివృద్ధి భారతాన్ని మోదీ అభిలషిస్తుంటే, రాహుల్ బాబా చొరబాటుదారులను కాపాడాలనుకుంటున్నారని అన్నారు. 'ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారులను తప్పించాలా? వద్దా?' అని అమిత్‌షా ప్రశ్నించారు. బిహార్‌లో ఒక్క చొరబాటుదారుని కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

యత్రీంద్ర అలా అనలేదు.. కుమారుడి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య

మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 25 , 2025 | 04:14 PM