Amit shah: ఆర్జేడీ ప్రభుత్వం వస్తే కిడ్నాప్లు, లూటీలు, హత్యలకు కొత్త శాఖలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:11 PM
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు అమిత్షా చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు.
ముజఫర్పూర్: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సారథ్యంలోని 'మహాగట్బంధన్' (Mahagathbandhan)పై కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ-కాంగ్రెస్-వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ కూటమికి ఓటు వేసి, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే కిడ్నాప్లు, లూటీలు, హత్యలకు కూడా కొత్త శాఖలు ఏర్పాటు చేస్తారని హెచ్చరించారు. బిహార్లోని ముజఫర్పూర్లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు. సోనియా, లాలూ కలలు ఎప్పటికీ ఫలించవని, నితీష్ కుమార్ బిహార్ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారని పేర్కొన్నారు. బిహార్లోని అధికార ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని వరదల నుంచి విముక్తి చేసేందుకు కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఒక వ్యక్తిని ఎమ్మెల్యేను చేయడానికో మంత్రిని చేయడానికో ఓటు వేయవద్దని, బిహార్ను జంగిల్ రాజ్ నుంచి కాపాడేందుకు ఓటు వేయాలని అమిత్షా కోరారు. లాలూ-రబ్రీ 15 ఏళ్ల పాలనలో బిహార్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదన్నారు. ఎన్డీయేకు ఓటు వేయాలని ముజఫర్పూర్ ప్రజలు నిర్ణయించుకుంటే జంగిల్ రాజ్ తిరిగి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6, 11 తేదీల్లో జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
కేరళ కమనీయం.. అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి