Mahindra Talent Scholarship 2025: మంచి ఛాన్స్..ఏడాదికి రూ.10 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేయండి..
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:22 PM
మీరు పది లేదా ఇంటర్ పూర్తి చేసి డిప్లొమా చదవాలనుకుంటున్నారా? కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువు ఆగిపోతుందేమోనని ఆందోళనలో ఉన్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.
10వ తరగతి లేదా ఇంటర్ పూర్తైన తర్వాత మీరు పై చదువులు చదవాలని చూస్తున్నారా. మీరు ఆర్థికంగా వెనుకబడినా కూడా, మీ కలల్ని నెరవేర్చుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంది. అందుకోసం Mahindra All India Talent Scholarship (MAITS) 2025 మీకు మంచి అవకాశం కల్పిస్తోంది. ప్రతిభ ఉండి, సరైన సపోర్ట్ లేక చదువు ఆపకూడదనే లక్ష్యంతో మహీంద్రా గ్రూప్ స్కాలర్షిప్ సౌకర్యాన్ని అందిస్తోంది.
ఆయా కోర్సుల కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించి, మీ లక్ష్యాలకు అండగా నిలుస్తుంది. కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ విద్యకు విలువ ఇచ్చే లక్ష్యంతో మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ (MAITS)ను ప్రారంభించింది. దీని ద్వారా డిప్లొమా చదవాలనుకునే ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఈ స్కాలర్షిప్ వల్ల ఏం లాభం?
ఈ స్కాలర్షిప్ కింద ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 10,000/- అందజేస్తారు. ఇది గరిష్ఠంగా మూడు సంవత్సరాల పాటు లభిస్తుంది. అంటే మొత్తం రూ. 30,000/- వరకు మీ డిప్లొమా చదువు కోసం సపోర్ట్ లభిస్తుంది. ప్రతి సంవత్సరం 550 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,940 మంది విద్యార్థులు ఈ లబ్దిని పొందారు.
అర్హతలు ఏం ఉండాలంటే?
పది (SSC) లేదా ఇంటర్ (HSC) పరీక్షల్లో 60% కన్నా ఎక్కువ మార్కులు ఉండాలి.
మీరు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి
మీ కుటుంబ వార్షిక ఆదాయం తక్కువగా ఉండాలి.
ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం?
కేవలం అర్హత ఉన్నంత మాత్రానే కాకుండా ఈ కింది వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు
బాలికలు (పిల్లలు)
తక్కువ ఆదాయ కుటుంబాల్లోని విద్యార్థులు
శారీరకంగా అంగవైకల్యం ఉన్నవాళ్లు
ఆర్మీ, పోలీస్, ఇతర కేంద్ర సాయుధ దళాల ఉద్యోగుల పిల్లలు
ఎలా అప్లై చెయ్యాలి?
అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో నింపాలి. దానికి కావలసిన సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లై చేయకముందే, అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
ఒరిజినల్ సర్టిఫికెట్ స్కాన్ కాపీలు ఇస్తే, సెల్ఫ్-అటెస్టు అవసరం లేదు.
ఈ సంవత్సరం (2025-26) స్కాలర్షిప్కి అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ విద్యార్థులకు: ఆగస్టు 27, 2025
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు: ఆగస్టు 31, 2025
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి