AP News: ఆన్లైన్ గేమ్ ఆడితే.. కటకటాలే..
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:17 PM
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినా.. ఆన్లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.
- కేంద్రం కన్నెర్ర
- నిషేధిస్తూ.. పార్లమెంటులో బిల్లు పాస్
(
రాయచోటి(కడప), ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్(Betting Apps)లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినా.. ఆన్లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది. గత వారంలో ప్రఽధాని మోదీ నేతృత్వంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాస్ కావడంతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. దీంతో ఇక ఆన్లైన్ బెట్టింగ్లకు ముకుతాడు పడినట్లే అని ప్రజలు భావిస్తున్నారు.
- తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీకి చెందిన ఓ టెంపో డ్రైవర్ గత డిసెంబరులో ఆన్లైన్ గేములు ఆడి సుమారు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులు తీర్చే దారిలేక అప్పులు ఇచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక.. ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఇదే మండలం దిగువగాలిగుట్టపల్లెకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడి.. సుమారు రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులు తీర్చేదారి లేక గత ఏడాది అక్టోబరులో సీటీఎం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
- వాల్మీకిపురంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న గుర్రంకొండ మండలం తరిగొండ పంచాయతీకి చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి లక్షల రూపాయలు అప్పులపాలయ్యాడు. చివరకు భార్య బంగారు నగలను కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి పంచాయతీ స్టేషన్కు చేరింది.

ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రజల చేతుల్లోకి విరివిగా వచ్చేసి ఫోన్లోనే అన్ని రకాల బెట్టింగ్లు ఆడడం అతి సులువుగా మారింది. వేల కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టి.. నడివీధికి ఈడుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యా్పలపైన కొరడా ఝళిపించింది. దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నిషేధించింది. ప్రస్తుతం మార్కెట్లో వందలాది బెట్టింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమింగ్ యాప్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో పలువురు ఈ యాప్ల ద్వారా దేశ, విదేశాల నుంచి అతి సులువుగా ఫోన్లోనే ఆన్లైన్ బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. గతంలో క్రికెట్లో ఎక్కువగా బెట్టింగ్ జరిగేది. ప్రస్తుతం హాకీ, ఫుట్బాల్ ఇలా అన్ని రకాల ఆటల్లోకి ఆన్లైన్ బెట్టింగ్ చొరబడింది. వీటితో పాటు రమ్మీ వంటి జూదం ఆడేందుకు కూడా యాప్లు అందుబాటులో ఉన్నాయి.
ఉచ్చులో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు
ఈ ఆన్లైన్ గేమ్ బారిన విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కూలీలు, ఉద్యోగులు, చివరికి రైతులు సైతం పడుతున్నారు. కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా ఆన్లైన్ గేములలో పోగొట్టుకుంటున్నారు. ఎందరో విద్యార్థులు పరీక్ష ఫీజుల కోసమని ఇచ్చిన డబ్బును సైతం బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. నెలకు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. తమ జీతాలే కాకుండా.. బయట అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు. సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసే సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్నారు. దీంతో ఎక్కువ మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.
ఏటా రూ.8.39 లక్షల కోట్ల అక్రమ బెట్టింగ్లు
వివిధ అధ్యయనాల ప్రకారం దేశీయంగా ఏడాదికి రూ.8.39 లక్షల కోట్ల మేరకు అ క్రమ బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలు స్తోంది. ఆన్లైన్ జూద క్రీడల్లో నిత్యం డబ్బులు గుమ్మరిస్తున్న భారతీయులు 14 కోట్ల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ సమయంలో ఇది సుమారు 37 కోట్ల వరకు ఉంటోంది. మొదట్లో పట్టణాలకే పరిమితమైన ఈ బూతం ప్రసుత్తం దేశవ్యాప్తంగా పల్లెలకూ విస్తరించింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News