Pawan Kalyan: అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:02 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.
డోలీరహిత గిరిజన ఆవాసాలే లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, డోలీరహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అధికారులందరి.. సమీష్ట కృషితోనే ఇది సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు.
అడవి తల్లి బాటపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు నిధులు కేటాయించి సహకారం అందించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకొంటున్నట్లు వివరించారు. ఇన్ని అవకాశాలు ఉన్నందున అడవి తల్లి బాట పనుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి రోడ్డు సౌకర్యం పొందే ఆవాసాలు కూడా ఈ పథకంలో ఉన్నాయని గుర్తుచేశారు. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరని అభిప్రాయపడ్డారు. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని చెప్పాలని పేర్కొన్నారు. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం