Minister AnamL: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:20 AM
సింహాచలంలో ప్రసాద స్కీం పనులు ఆలశ్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని మంత్రి చెప్పారు.

నెల్లూరు: సింహాచలం (Simhachalam) దేవస్థానంలో చందనోత్సవం (Chandanotsavam) బుధవారం ఏకువజామున 2 గంటలకు ప్రారంభమైందని, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం (Nijaroopa Darshanam) జరుగుతుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramnarayana Reddy) తెలిపారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై స్పందించిన మంత్రి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ నిబంధనలు, ఆగమ శాస్త్రం ప్రకారం ముందుగా పూసపాటి ఆశోక్ గజపతి రాజు కుటుంబం దర్శనం చేసుకుందన్నారు. తరువాత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శనం చేసుకున్నారని తెలిపారు. కొండపై భాగం నుంచి ఒక్కసారిగా వరద వచ్చి గోడవద్దకి చేరడంతో కూలిందని మంత్రి చెప్పారు.
Also Read: PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..
సింహాచలంలో ప్రసాద స్కీం పనులు ఆలశ్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన అన్ని క్యూ లైన్లలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారని, ఇప్పటికే 34 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు చెప్పారన్నారు. అకస్మాత్తుగా ప్రళయంలా విపత్తు రావడంతో 8 మంది భక్తులు మృతి చెందారని తెలిపారు.
మృత దేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అందులో ముగ్గురిని గుర్తించడం జరిగిందని, మిగిలిన వారినీ గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉదయం మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పారు. సీఎం విశాఖకు రావాలనే ఆలోచన చేశారని.. అయితే లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో సీఎం వెళితే, భక్తులకి కొంత ఆలశ్యం అయ్యే అవకాశం ఉందని చెప్పామన్నారు. మంత్రులు, అధికారులు దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు చాలా ఆందోళన వ్యక్తం చేశారని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని మంత్రి ఆనం తెలిపారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వారికి రూ.3 లక్షలు పరిహారం అందజేస్తామని చెప్పారు. ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించామన్నారు. ఒకవేళ అధికారులు, కాంట్రాక్టర్ల పొరపాట్లు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం ఆదేశించారని స్పష్టం చేశారు. అనువజ్ఞులైన వారిని కమిటీలో నియమిస్తామని, మరి కాసేపట్లో సీఎం కార్యాలయం నుంచి వారి పేర్లనను ప్రకటిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం ఘటనపై కేటీఆర్ స్పందన..
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..
For More AP News and Telugu News