MLA Sunitha: హైటెక్ సిటీతో హైదరాబాద్.. గూగుల్తో విశాఖ అభివృద్ధి
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:03 PM
హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.
- రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
- గూగుల్ సంస్థ విశాఖకు రాకపై హర్షం
అనంతపురం: హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు. గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైటెక్ సిటీగా రూపకల్పన చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుతం వైజాగ్కు గూగుల్ సంస్థను తీసుకొచ్చి మరోసారి తన ముందుచూపు, దార్శనికతను చాటుకున్నారన్నారు. ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్ విశాఖలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ హబ్ను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న ఐదేళ్లలో 1.33 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనుందన్నారు. తద్వారా అమెరికా తరువాత ప్రపంచంలోనే ఆ సంస్థ నిర్మించే అతిపెద్ద ఏఐ హబ్గా విశాఖపట్నం యూనిట్ నిలుస్తుందన్నారు.

2 లక్షల మందికి ఉపాధి కల్పించే 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ర్టానికి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయమన్నారు. ప్రతి కుటుంబానికి కృత్రిమ మేధ ఫలాలను చేరువ చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుందన్నారు. భావితరాల కోసం వీరు చేస్తున్న కృషి ఎంతో ఉందన్నారు. రానున్న మూడున్నరేళ్లలో రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News