Share News

PM Modi Andhra Visit: రేపు ఏపీలో ప్రధాని పర్యటన... నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:07 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దామన్నారు సీఎం. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు.

PM Modi Andhra Visit: రేపు ఏపీలో ప్రధాని పర్యటన... నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్
PM Modi Andhra Visit

అమరావతి, అక్టోబర్15: ఏపీలో రేపు (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు.


కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని ఇది చారిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు సీఎం. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి.. నాలెడ్జి ఎకనామీకి పునాది పడిందని గుర్తుచేశారు. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉందన్నారు. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారన్నారు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చిందని.. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని సీఎం పేర్కొన్నారు.


విభజనతో ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా అనేక తప్పులు చేశారని... వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టిందన్నారు. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశామన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గోనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుందన్నారు. నెక్స్ జెన్ సంస్కరణలపై నెల్లాళ్లుగా విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. సీమ జిల్లాలు ఉద్యావన పంటలకు కేంద్రంగా మారాయన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రైల్వేల కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతోందని అన్నారు ముఖ్యమంత్రి. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాయలసీమ టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తామని ప్రకటించారు. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని సూచించారు.


రేపు కూడా ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. కర్నూలులో జీఎస్టీపై ప్రధాని సభకు సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. గ్రామ స్థాయి నుంచి మూడు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. కూటమి నేతలంతా కలిసి ఓ మోడల్ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్ధశ రాబోతోందని చెప్పుకొచ్చారు. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక గూగుల్ సంస్థను ఏపీకి తేవటంలో సీఎం, మంత్రి నారా లోకేష్ కృషి ప్రశంసనీయమని టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, నేతలు కొనియాడారు.


ఇవి కూడా చదవండి..

కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై....

డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 01:25 PM