Lokesh US Tour: లోకేష్ యూఎస్ పర్యటన.. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాది: మోహన కృష్ణ
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:44 AM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే దార్శనిక లక్ష్యంతో మంత్రి లోకేష్ నిర్వహించిన అమెరికా పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్ పర్యటనలో లోకేష్ పడిన శ్రమ, దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశాలను మోహన్ వివరించారు.
అమెరికా, డిసెంబర్ 11: మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాది అని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ అన్నారు. లోకేష్ యూఎస్ పర్యటలో మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ అమెరికా పర్యటన, ఏపీలో పెట్టుబడుల కోసం ఆయన శ్రమిస్తున్న తీరును మన్నవ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. అమెరికాలో జెట్ లాగ్ను కూడా లెక్కచేయకుండా ఉదయం నుంచి రాత్రి దాకా దిగ్గజ కంపెనీల సీఈవోలతో బ్యాక్–టు–బ్యాక్ వరుస మీటింగ్లు జరిపి ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ పడిన శ్రమ అభినందనీయమని కొనియాడారు.
యూఎస్ పర్యటనలో భాగంగా గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ సమావేశమై విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభంపై చర్చించారని తెలిపారు. విశాఖలో $15బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు. ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో లోకేష్ సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారన్నారు. అలాగే గేమింగ్, చిప్ డిజైనింగ్, జిపియు మ్యానుఫ్యాక్చరింగ్లో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్ మిర్ పూరితో శాంటాక్లారాలో మంత్రి భేటీ అయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే అడోబ్ సీఈవో శంతను నారాయణన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యి విశాఖపట్నంలో అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా డెవలప్ మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరినట్లు మోహన కృష్ణ తెలిపారు.

వీరితో పాటు జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో మంత్రి సమావేశమై అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ అండ్ డి/ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నంలో ఒక జీసీసీ (GCC) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఆంధ్రప్రదేశ్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు అందించేలా లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. లోకేష్ అమెరికా పర్యటనలో పాల్గొనటం, పర్యటన దిగ్విజయంగా జరగటం చాలా సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
Read Latest AP News And Telugu News