CM Review on Amaravati Lands: అమరావతిలో నిర్మాణాలపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:26 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం..
విజయవాడ, జులై 08: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే దానిపై చర్చించారు. ఈ సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కాగా, ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంలో నేరుగా ఆయా సంస్థల యజమానులతో సీఎం మాట్లాడారు. ఇప్పటి వరకు రాజధానిలో 72 సంస్థలకు 947 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, మత సంస్థలు, ఐటీ, టెక్ పార్కులు ఉన్నాయి.
అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని, జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలు పెట్టి పూర్తి చేయాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఏ సందర్భంలోనూ, ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదని సీఎం స్పష్టం చేశారు. కాగా, నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 17 సంస్థల ప్రతినిధులు చెప్పారు. దీంతో ప్రతి కంపెనీ, సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళిక తెలుసుకుని, స్పష్టమైన హామీని ప్రభుత్వం తీసుకుంటోంది.
Also Read:
రాఫెల్పై పాక్ పచ్చి అబద్ధాలు.. దసో సీఈవో
వెంట్రుకవాసిలో బతికిపోయింది.. లేదంటే..
స్వగ్రామంలో రైతులకు ఎన్నారై ఇంజినీర్ ఆపన్నహస్తం
For More Andhra Pradesh News and Telugu News..