Minister Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలు.. రైతులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 07:24 PM
Minister Nadendla Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలపై రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జామ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
అమరావతి: కూటమి ప్రభుత్వంలో రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంతో విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులో పకడ్బందీగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. రైతుల నుంచి 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగామని అన్నారు.
రైతుల నుంచి సేకరించిన 24 గంటలల్లోపే రూ.5,878.49 కోట్లు చెల్లింపులు చేయడంతో 5,99,952 మంది రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. జగన్ ప్రభుత్వం వరి రైతులను ఎంతగా ఇబ్బందుల పాల్జేసిందో, ధాన్యం సేకరించినా డబ్బులు చెల్లించకుండా బకాయిలుపెట్టిందో అందరికీ తెలుసు అని చెప్పారు.. కూటమి ప్రభుత్వం రూ..1674 కోట్లు బకాయిలు చెల్లించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సౌభాగ్యం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.