Anagani Sathya Prasad: ఏపీలో జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ: మంత్రి అనగాని
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:06 PM
జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు.
అమరావతి, డిసెంబర్ 09: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వెబ్ ల్యాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తం అయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెవెన్యూ శాఖపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. గత పాలకులు చేసిన పాపాల వల్లే రెవెన్యూ శాఖలో సమస్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వ పాపాలు కడిగేందుకు కృషి చేస్తున్నందు వల్లే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకునేందుకు గత పాలకులు అస్తవ్యస్తం చేసిన విధానాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. 7,600 గ్రామాల్లో పకడ్బందీగా రీ సర్వే పూర్తి చేశామని ఈ సందర్భంగా మంత్రి అనగాని సోదాహరణగా వివరించారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే నియమించాలని సీఎం ఆదేశించారన్నారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు. భూ సమస్యలన్నింటికీ ఇక జాయింట్ కలెక్టర్లదే బాధ్యత అని మంత్రి అనగాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 22ఏ, ఫ్రీ హోల్డ్ సమస్యలు పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వివరించారు. భూ వివాద రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ప్రతీ బుధవారం కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఎల్లుండి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.
ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని మంత్రి అనగానితోపాటు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రియల్టైమ్లో పట్టాదారు పాస్ పుస్తకాల ఆటో మ్యుటేషన్ జరగాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలని ఈ సందర్భంగా ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలని ఈ సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. ప్రతి నెలా రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్లాండ్లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News