Kakinada: వెలుగులోకి వచ్చిన మరో కీచక టీచర్ ఉదంతం.. విద్యార్థినిలను ఏం చేశాడంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 07:33 PM
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తీసుకువచ్చాడు.
కాకినాడ జిల్లా: కీచక ఉపాధ్యాయుల ఉందంతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తూ కామాంధుల నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పాల్సిన విద్యాలయాలు సైతం వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. ఓ పక్కన ప్రేమ పేరుతో ఉన్మాదులు యువతుల మానప్రాణాలు తీస్తున్నారు. యాసిడ్ దాడులు, కత్తులతో రెచ్చిపోతున్నారు. మరోపక్కన హత్యాచారాలతో కామాంధులు బరితెగిస్తున్నారు. పని ప్రదేశాలు, ఇల్లు, బస్సులు సహా వారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. నెలల బిడ్డ నుంచి పండు ముసలి వరకూ ఆడవారిపై కామాంధులు రెచ్చిపోతున్నారు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తీసుకువచ్చాడు. టీచర్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీర భాగాలను తాకాడంటూ ఐదుగురు విద్యార్థినిలు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్, కొత్తపల్లి పోలీసులకు ప్రిన్సిపల్ తెలియజేశారు. దీంతో హుటాహుటిన పాఠశాలకు వద్దకు అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు.
అయితే విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుటే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు, తోటి ఉపాధ్యాయులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విచారణ పూర్తి చేసిన ఎంఈవో వేణుగోపాల్ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..
Andhra Pradesh: నరసాపురంలో ఉద్రిక్తత.. సామాజిక వర్గాల మధ్య కొట్లాట..