Share News

TG: బిల్లులన్నీ పెండింగ్‌..

ABN , Publish Date - May 24 , 2024 | 05:09 AM

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు అందడంలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్‌ కావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపు జరగడంలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకూ చెల్లింపుల్లేవు.

TG: బిల్లులన్నీ పెండింగ్‌..

  • గత ప్రభుత్వం నుంచి క్లియర్‌ కాని బకాయిలు

  • విద్యార్థులకు ఐదేళ్లుగా ఫీజులు, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌

  • రూ.6 వేల కోట్లకు చేరిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌

  • వైద్య ఆరోగ్యశాఖ బిల్లుల బకాయి రూ.3 వేల కోట్లు

  • సర్కారు దవాఖానాల మందులకూ చెల్లింపులు శూన్యం

  • ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4 వేల కోట్లు అవసరం

  • ఖజానాలో సొమ్ములేక క్లియర్‌ చేయని సర్కారు

  • ఒక్కో నెలలో మైనస్‌లోకి జారుకుంటున్న ఖజానా

  • అప్పుల అసలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు అందడంలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్‌ కావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపు జరగడంలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకూ చెల్లింపుల్లేవు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేరుకుపోయిన బిల్లులు ఇప్పటికీ క్లియర్‌ కావడం లేదు. ఖజానాలో సొమ్ములేక ప్రభుత్వం వీటిని పెండింగ్‌లో పెడుతోంది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులకు సమస్యలు ఎదురవుతుండగా, ఆస్పత్రుల్లో మందులు లభించక, ఆరోగ్యశ్రీ సేవలు సవ్యంగా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. కాలేజీలను మూసేసుకునే పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఔషధ కంపెనీలు తమకు బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు పది నెలలుగా క్లియర్‌ కావడం లేదని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం అంటోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం, నెలవారీగా సమకూరుతున్న రాబడులు.. నెలవారీ వ్యయాలకే సరిపోతుండడంతో ప్రభుత్వ ఖజానాలో సొమ్ము మిగలడం లేదు. పైగా పార్లమెంటు ఎన్నికల కోడ్‌ కారణంగా బిల్లుల చెల్లింపుల్లో కొంత సమస్య ఎదురైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనైనా బిల్లుల బకాయిల్లో ఎంతో కొంత విడుదల చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల బకాయిలు ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20 సంవత్సరం నుంచి ఫీజులను ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. వీటికి ప్రతి ఏటా కొంత కలుస్తూ ప్రస్తుతం ఈ రెండు పద్దుల కింద రూ.6 వేల కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే రూ.4 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 2019-20లో రూ.500 కోట్లు, 2020-21లో రూ.2,250 కోట్ల బకాయిలు ఉండగా.. ప్రభుత్వం రూ.1,850 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఇంజనీరింగ్‌ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఫలితంగా ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుని బయటికెళ్లబోయే విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంటర్‌, డిగ్రీ పూర్తియిన విద్యార్థులు రెండు మూడేళ్ల క్రితమే కోర్సును పూర్తి చేసినా.. ఫీజు రీయింబర్స్‌ కాలేదు. స్కాలర్‌షి్‌పల సొమ్ము విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారింది.


టోకెన్ల జారీతోనే సరి..!

కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను క్లియర్‌ చేసేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టోకెన్లు జారీ చేసింది. కానీ, సొమ్ము మాత్రం కాలేజీలకు అందలేదు. ఈ బకాయిలను ప్రతి మూడు నెలలకు కొంత చొప్పున చెల్లిస్తామంటూ ప్రభుత్వం వాయిదాల పద్ధతిని తీసుకొచ్చింది. దాని ప్రకారం విద్యా ఏడాది ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివర్లో మరో 25 శాతం చెల్లిస్తామని పేర్కొన్నది. కానీ, ఈ విధానాన్నీ పాటించలేదు. పర్యవసానంగా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. పైగా... ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతి మూడేళ్లకోసారి పెంచుతున్న ఫీజుల పద్ధతి కూడా అమలు కావడం లేదు. ఇదివరకు బీటెక్‌, ఫార్మసీ, న్యాయ విద్య, బీఎడ్‌ వంటి కోర్సులకు రూ.38 వేలు ఫీజు ఉండేది. ఇది ఇప్పుడు రూ.70 వేలకు పెరిగింది. కానీ, పెరిగిన మేర ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్‌ చేయడం లేదని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. స్కాలర్‌షి్‌పలు కూడా పెరిగినా... విద్యార్థులకు అందడం లేదు.


జూన్‌ మొదటి వారంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌?

ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులను క్లియర్‌ చేయకపోవడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలకు చికిత్సలు/శస్త్ర చికిత్సలు సవ్యంగా అందడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. కానీ, ఆరోగ్యశ్రీ పరిఽధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బకాయిలను క్లియర్‌ చేయలేకపోతోంది. గత పది నెలలుగా ఈ బిల్లులు క్లియర్‌ కావడం లేదని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం ఆరోపిస్తోంది. జూన్‌ 1న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సమావేశం కావాలని నిర్ణయించింది. అనంతరం జూన్‌ మొదటి వారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేయాలని యోచిస్తున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సర్కారు దవాఖానాల్లో డైట్‌ కాంట్ర్టాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించడంలేదు. ఈ బిల్లులు సుమారు రూ.30-35 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఒక్క సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి సంబంధించిన డైట్‌ బిల్లే రూ.51 లక్షల మేర పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లోని గాంధీలాంటి ఆస్పత్రుల్లో నెలకు డైట్‌ బిల్లే రూ.కోటి వరకు ఉంటుంది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో డైట్‌ కాంట్రాక్టర్లు రోగులకు నాసిరకపు భోజనం పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిన్నింటికి తోడు జాతీయ వైద్య ఆరోగ్య మిషన్‌ పరిఽధిలో పనిచేస్తున్న సుమారు 60 వేల మందికి వేతనాలు సక్రమంగా చెల్లించడంలేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో వారి జీతాల భారం రూ.వందల కోట్లకు చేరింది.


ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే..

వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగా లేదు. నెలవారీగా సమకూరుతున్న రాబడులు... నెలవారీ వ్యయాలకే సరిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా అప్పుల అసలు, వడ్డీలు చెల్లించాలంటేనే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ప్రతి నెలా అన్ని రకాల రాబడుల ద్వారా రూ.12-14 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతున్నాయి. నెలకు మరో రూ.4-5 వేల కోట్ల వరకు రుణాలు తీసుకుంటోంది. ఇలా వచ్చే రూ.18-19 వేల కోట్లను ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, అప్పుల కిస్తులు, వడ్డీ చెల్లింపులకు సర్దుతోంది. పర్యవసానంగా సప్లిమెంటరీ బిల్లుల క్లియరెన్స్‌కు ఖజానాలో సొమ్ము మిగలడం లేదు. అప్పుల అసలు, వడ్డీల కింద 2023-24లో ప్రభుత్వం రూ.53,978 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. ఇందులో బడ్జెట్‌ రుణాల అసలు కిస్తీలు, వడ్డీలకు రూ.32,939 కోట్లను చెల్లించాల్సి రాగా... బడ్జెట్‌కు ఆవల కార్పొరేషన్ల గ్యారెంటీల పేర తీసుకున్న రుణాల అసలు, వడ్డీల కింద రూ.21,039 కోట్లను చెల్లించింది. అంటే... నెలకు సగటున రూ.5 వేల కోట్లు అసలు, వడ్డీలకే సరిపోయాయి. ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొన్నది. వడ్డీల కిందే నెలకు రూ.2 వేల కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కింద రూ.4,500 కోట్లకు పైగా చెల్లించాలి. ఈ వడ్డీలు, వేతనాలే సింహభాగం నిధులను హరిస్తున్నాయి. మధ్యలో సీజన్లవారీగా రైతుభరోసా కార్యక్రమం వచ్చిందంటే... ఖజానా వట్టిపోవాల్సిందే. ప్రస్తుతం రైతుబంధు స్కీమ్‌ కిందనే సొమ్మును చెల్లించాల్సి వస్తుండడంతో ప్రతి సీజన్‌కు రూ.7,600 కోట్లు అవసరమవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరానికి రూ.15 వేల స్కీమ్‌ను అమలు చేస్తే ఇంకా ఎక్కువే నిధులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా వివిధ సేవలకు సంబంధించిన బిల్లుల బకాయిలు క్లియర్‌ కావడం లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే... అత్యవసర సేవలు, అధిక సంఖ్యాక ప్రజలకు సంబంధించిన విద్యా, వైద్యం, ఉద్యోగుల బకాయిలను కొంత మేరకైనా చెల్లించేలా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


వైద్య ఆరోగ్యశాఖలో 3వేల కోట్ల పెండింగ్‌..

వైద్య ఆరోగ్యశాఖలోనూ బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. అత్యవసర సేవల కిందకు వచ్చే ఆరోగ్య శాఖలోని వివిద విభాగాల కింద సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) కింద రూ.1500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేటు మందుల కంపెనీల నుంచి టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఔషధాలను కొనుగోలు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. అయితే ప్రైవేటు ఫార్మా కంపెనీలకు ఆ సంస్థ పాత బకాయిలు చెల్లించకపోవడంతో.. తాము మందులను సరఫరా చేయలేమని ఆ కంపెనీలు మొండికేస్తున్నాయి. దీంతో పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లభించని పరిస్థితి నెలకొంటోంది. ఒకవేళ లభించినా.. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, అంటురోగాలు, పాముకాటు, రేబిస్‌ సంబంధిత అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ బాలికల కోసం శానిటరీ నాప్‌కిన్స్‌, వాటిని డిస్పోజ్‌ చేసే వెండింగ్‌ మిషన్లను సరఫరా చేయగా.. అందుకు సంబంధించిన బిల్లులను గత రెండేళ్లుగా చెల్లించడం లేదు. ఈ బిల్లు కేవలం రూ.2 కోట్ల లోపే ఉన్నా... చెల్లించకపోవడం గమనార్హం.


ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షమెప్పుడో?

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది అన్నట్లుగా తయారైంది. వీరికి సంబంధించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాటి సప్లిమెంటరీ బిల్లులు ఇప్పటికీ క్లియర్‌ కావడం లేదు. గ్రాట్యుటీ, ప్రభుత్వ జీవిత బీమా, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్స్‌, కమ్యూటేషన్‌ వంటి బిల్లులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ బిల్లులను తయారు చేసి, సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు పంపడం, అక్కడి నుంచి టోకెన్లు జనరేట్‌ కావడం షరా మామూలుగా మారింది. కానీ, బిల్లుల తాలూకు సొమ్ము మాత్రం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ క్లియర్‌ చేయాలంటే రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇంక్రిమెంట్‌ ఏరియర్స్‌, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌, పీఆర్సీ ఏరియర్స్‌, మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌ సంబంధిత రూ.25 వేలు, రూ.30 వేల విలువైన బిల్లులను క్లియర్‌ చేశారు. కానీ.. రూ.లక్షల్లో ఉన్న బిల్లులను మాత్రం క్లియర్‌ చేయడం లేదు. పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని, ఆర్థిక శాఖను పర్యవేక్షించే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా కలిసి బిల్లులను క్లియర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 24 , 2024 | 05:09 AM