Share News

Hyderabad: వేలం గ్యారెంటీ...

ABN , Publish Date - May 27 , 2024 | 05:16 AM

ఆరు గ్యారెంటీల అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Hyderabad: వేలం గ్యారెంటీ...

  • 6 గ్యారెంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు

  • వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు

  • నియోపొలిస్‌లో అందుబాటులో వాణిజ్య భూమి

  • బుద్వేల్‌లోనూ ఖరీదైన భూములు

  • ‘మల్టీ మోడల్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌’గా ఫార్మాసిటీ భూములు

  • టౌన్‌షిప్‌లు, పరిశ్రమలు, హెల్త్‌సిటీ ఏర్పాటుకు ప్రణాళిక

  • ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఉన్న భూములపైనా దృష్టి

  • భూముల వేలంతో 14 వేల కోట్లు ఆర్జించిన గత సర్కారు!

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీల అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


పథకాల కోసం భూములను వేలం వేయడంతోపాటు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి సేకరించే రుణాలకు తాకట్టుగా పెట్టేందుకు వాడుకోవాలని రేవంత్‌ సర్కారు భావిస్తోంది. అదే సమయంలో ఓఆర్‌ఆర్‌- ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజనల్‌ రింగ్‌రోడ్డు)కు మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌)లో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను కూడా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న యోచనలో ఉంది. అటు అభివృద్ధి- ఇటు ఆదాయం.. ఉభయతారకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఓర్‌ఆర్‌ఆర్‌- ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలన్నదానిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు సమాచారం.


మల్టీ మోడల్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌గా..

ఫార్మాసిటీ భూముల గురించి కూడా సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఫార్మాసిటీని 19,300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించగా.. అందులో ప్రభుత్వానిదే 9,133 ఎకరాలు ఉంది. దానికితోడు రైతుల నుంచి ఇప్పటికే సేకరించింది సుమారు 4 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూముల్లో గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లు, నీరు, విద్యు త్తు వంటి మౌలిక సదుపాయాలనూ కొంతమేరకు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ భూముల్లో ఫార్మాసిటీ కాకుండా టౌన్‌షి్‌పలు ఏర్పాటు చేస్తామని, అలాగే కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళికనే రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ భూముల్లో మల్టీ మోడల్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫార్మాసిటీ క్లస్టర్లను కొంచెం దూరం గా వేర్వేరు చోట్ల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల్‌, యాచారం మండలాల్లో సేకరించిన భూములు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. వాటిలో నివాస టౌన్‌షి్‌పలను అభివృద్ధి చేయడం కోసం కొంత భూమిని వేలం వేయడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం లాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు.


అలాగే కొంతమేర వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలకు కేటాయిస్తారు. కొంత భూ మిని హెల్త్‌ సిటీ కోసం.. అంటే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా భూ కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్కడ జరిగే అభివృద్ధిలో ఉద్యోగాల కల్పన కూడా ఉండాలని.. అలా ఉంటేనే నివాస సముదాయాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసం హెల్త్‌సిటీ, పారిశ్రామిక సంస్థలు.. అదేవిధంగా కొంత మేర కాలుష్యరహిత ఫార్మా కంపెనీలకు కూడా భూ ములు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ భూ ములను కూడా అటు ప్రభుత్వానికి ఆదాయ మార్గం.. అదే సమయంలో అభివృద్ధి జరిగేలా ప్రణాళిక రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు మొత్తం జిల్లాల వారీగా ప్రభు త్వ భూముల వివరాలను తక్షణమే రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభు త్వ భూముల విషయంలో ప్రస్తుతానికి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ఇటు అసైన్డ్‌ భూములను కూడా లేఅవుట్లుగా అభివృద్ధి చేయడానికి సేకరించాలని, రైతులకు వాటా ఇవ్వాలని గతంలోనూ నిర్ణయించారు. ఇప్పుడు ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యే అవకాశా లున్నాయి.


కొన్నేళ్ల కిందటి సమాచారం ప్రకారం ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లోనే 8,260 ఎకరాలు ఉంది. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 7,452 ఎకరాలు, హైదరాబాద్‌ జిల్లాలో 299 ఎకరాలు, మెదక్‌ పరిధిలో 558 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏకి కేటాయించారు. ఇందులో సుమారు 3,886 ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేశారు. ఇంకా సుమారు 4,374 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోం ది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే అత్యధికంగా 3,899 ఎకరాలుండగా హైదరాబాద్‌ పరిధిలో 37 ఎకరాలు, మెదక్‌ పరిధిలో 437 ఎకరాలుంది. అయితే ఇవన్నీ పాత లెక్కలే. బీఆర్‌ఎ స్‌ హయాంలో వీటిలో కొన్ని భూములను పలు అవసరాల కోసం కేటాయించారు. మరికొన్నింటిని వేలం వేశారు. 3వేల ఎకరాలకు పైగా న్యాయ వి వాదాల్లో ఉన్నాయి. వీటి పరిష్కారంపైనా సర్కా రు దృష్టిపెట్టింది. ఇక ఇప్పటికిప్పుడు ఏఇబ్బందులూ లేకుండా ఉన్న భూముల వివరాల నివేదికను రూపొందించాలని సర్కారు నిర్ణయించింది.


ఇప్పటికే రూ.14 వేల కోట్లు సేకరణ!

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా సుమారు రూ.14 వేల కోట్ల వరకు సమకూర్చుకున్నట్లు సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని కోకాపేటలో 49 ఎకరాలను వేలం ద్వారా విక్రయించగా రూ.2000.37 కోట్ల నిధులు సమకూరాయి. ఇదే తరహాలో అందుబాటులోని భూములను వేలం ద్వారా విక్రయించి సంక్షేమ పథకాల అమలుకు ఖర్చు చేయాలనే యోచనలో రేవంత్‌ సర్కారు ఉంది. కోకాపేట సమీపంలోని నియోపొలి్‌సలో వేలం ద్వారా ఒక్కో ఎకరం రూ.59- 100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇంకా అక్కడ విలువైన భూమి కొంత ఉంది. చుట్టూ భారీ ఆవాసాలు, ఆకాశహర్మ్యాలు, ఐటీ టవర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వాణిజ్య భూమికి మంచి ధర వస్తుందని సర్కారు అంచనా వేస్తోం ది. ఇటు బుద్వేల్‌లో కూడా గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది నెలల ముందే కొన్ని భూములను వేలం వేసింది. ఎకరా రూ.20-30 కోట్ల వరకు పలికింది. అక్కడ కూడా ఇంకా ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. ఇలా హైదరాబాద్‌, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవే టు భూములు, రైతుల భూములను కూడా వా రు ముందుకొస్తే అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఇలాంటి భూములను హెచ్‌ఎండీఏకే అప్పగించి లేఅవుట్లుగా అభివృద్ధి చేసి యజమానులకు కొంత, ప్రభుత్వానికి కొంత వాటా లెక్కన తీసుకుని.. వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనే యోచనలో కూడా ఉంది.


కోడ్‌ ముగిసిన వెంటనే కార్యాచరణ

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ముందు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ ముగిశాక విడతల వారీగా భూముల వేలం ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని, కోర్టు వివాదాల్లో లేని భూములను వేలం వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Updated Date - May 27 , 2024 | 05:16 AM