TG NEWS: హైదరాబాద్లో పేలుడు ఘటన వెనుక పలు అనుమానాలు
ABN , Publish Date - Nov 10 , 2024 | 10:25 AM
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇవాళ(ఆదివారం) ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పేలుడు ఎలా సంబవించింది అనే కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో ఇవాళ(ఆదివారం) ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి క్లూస్ టీమ్, డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు చేరుకున్నాయి. పేలుడు ఘటనపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు ఎలా సంభవించిందనే అంశాలపై అగ్నిమాపక శాఖ ఆరా తీసింది. మరోవైపు పేలుడు జరిగిన ప్రాంతానికి బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. పేలుడు ఘటనలో అరు ఇళ్లు పూర్తిగా ధ్వంసం..ఒక మహిళకు గాయాలు అయినట్లు గుర్తించారు. పేలుడు ఎలా సంభవించిందో ఇంకా స్పష్టత రాలేదు. పేలుడు ఘటనపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పేలుడు ఎలా సంభవించిందో కూడా తమకు తెలియదని హోటల్ సిబ్బంది అంటున్నారు. హోటల్ మేనేజర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
గ్యాస్ లీకేజి వల్ల ప్రమాదం: వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్
గ్యాస్ లీకేజి వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఫైర్ , క్లూస్ టీం బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. హైడ్రా బృందం కూడా ఘటనపై దర్యాప్తు చేస్తోందని అన్నారు. ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. హోటల్కు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
పేలుడు ఏలా జరిగిందంటే...
హైదరాబాద్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ పేలుడు అలజడి సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్లో ఈ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీప బస్తీలోని రాళ్లు ఎగిరిపడ్డాయి. దీంతో బస్తీలోని ఇళ్లలో వంటసామాగ్రి చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో ఓ బాలికకు గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాంబు కన్నా ఎక్కువ శబ్దంతో పేలుడు: ప్రత్యక్ష సాక్షి
తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ఏబీఎన్తో మాట్లాడారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని అన్నారు. పేలుడు దాటికి భయాందోళనలకు లోనయ్యామని చెప్పారు. పేలుడు తర్వాత మంటలు దట్టంగా వ్యాపించాయన్నారు. నిద్రలో ఉన్న హోటల్ సిబ్బంది మేల్కొలిపి మంటలను అదుపు చేశామని అన్నారు. బాంబు కన్నా ఎక్కువ శబ్దంతో పేలుడు జరిగిందని తెలిపారు. పేలుడు దాటికి ప్రహరీ గోడ ధ్వంసం అయిందన్నారు. గోడకు సంబంధించిన ఇటుకలు కింద ఉన్న బస్తీ వాసుల ఇళ్లపై పడ్డాయని.. అందులో ఒక మహిళ తలకు తీవ్ర గాయం అయిందని తెలిపారు.
ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు ధాటికి రెస్టారెంట్లోని అన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Census: సమగ్ర ఇంటింటి సర్వే షురూ
Kishan Reddy: రైతులపై రేవంత్ చిన్నచూపు
Mahbubnagar: ఎలివేటెడ్ ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ.
Read Latest Telangana News and Telugu News